హైదరాబాద్: మహాత్మా జ్యోతిరావు ఫూలే 198వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని త్యాగాలను, సమసమాజ కార్యాచరణను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) స్మరించుకున్నారు. పదేండ్ల తమ పాలనలో సబ్బండ వర్గాల కోసం అమలుచేసిన కార్యక్రమాల వల్ల సామాజిక ప్రగతి కార్యాచరణకు దారితీసిందని గుర్తుచేసుకున్నారు. ఒకనాడు అల్ప దృష్టితో, నిర్లక్ష్య ధోరణులతో వెనుకబడిన సమాజంగా తెలంగాణ మారిందని చెప్పారు. ఉద్యమ కాలం నుంచి రగిలిన సబ్బండ వర్గాల చైతన్యం రాష్ట్రం ప్రగతి పథంలో ముందడుగు వేసిందన్నారు. ఈ మొత్తం క్రమంలో మహాత్మా పూలే స్ఫూర్తి ఇమిడి ఉందన్నారు.
తమ పదేండ్ల పాలన కాలంలో అమలైన పథకాల కార్యాచరణ బహుజన వర్గాల ఆత్మగౌరవాన్ని ద్విగుణీకృతం చేసిందని తెలిపారు. అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిపిందన్నారు. అదే స్ఫూర్తి, కార్యాచరణ కొనసాగాలని ఆకాంక్షించారు. అన్ని రంగాల్లో బహుజనులు సమానత్వం సాధించేలా కృషి చేయడమే ఫూలేకు ఘన నివాళి అన్నారు.