KCR : రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి(Ambedkar Jayanti)ని పురస్కరించుకొని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జాతికి అంబేద్కర్ చేసిన కృషిని, ఆయన అందించిన విశేష సేవలను ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. ‘అన్ని రంగాల్లో వివక్ష రహిత సామాజిక సమానత్వం కోసం, వర్ణ, కుల, మత, లింగ బేధాలు లేకుండా భారతదేశ ఔన్నత్యాన్ని నిలిపే దిశగా కృషి చేసిన మహాదార్శనికుడు అంబేద్కర్’ అని కేసీఆర్ కొనియాడారు.
భారతదేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాల్లో మానవీయత ఫరిడవిల్లి.. భారత పౌరుడు విశ్వనరుడిగా ఎదిగేందుకు దోహదపడేలా రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ ప్రపంచ మేధావి అని కేసీఆర్ కొనియాడారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని, సమాఖ్య వ్యవస్థ బలోపేతానికి అంబేద్కర్ కృషి మహోన్నతమైనదని గులాబీ బాస్ అన్నారు.
దళిత, బహుజన వర్గాల అభ్యున్నతి కోసం, అంబేద్కర్ ఆశయాల సాధన కోసం మొదటి పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో విప్లవాత్మక కార్యాచరణను అమలు చేసిందని కేసీఆర్ గుర్తు చేశారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో డా. బీ ఆర్ అంబేద్కర్ పేరుతో సచివాలయాన్ని నిర్మించుకుని, రాష్ట్ర పరిపాలనలో అంబేద్కర్ స్ఫూర్తిని నింపే దిశగా చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు.

అంబేద్కర్ ఆశయాలను నిత్యం స్మరించుకుంటూ.. వారి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేందుకు రేపటి తరాలలో నిత్య చైతన్యం కలిగించేందుకు దేశంలో మరే రాష్ట్రం ఏర్పాటు చేయని విధంగా ఆకాశమంత ఎత్తున అంబేద్కర్ ప్రతి రూపాన్ని హైదరాబాద్ నడిబొడ్డున భారీ విగ్రహంగా ప్రతిష్టించుకున్నామని కేసీఆర్ తెలిపారు. శతాబ్దాల కాలంగా సామాజిక వివక్షకు గురవుతున్న ఎస్సీ కులాల ఆత్మగౌరవం ద్విగుణీకృతం చెందాలనే లక్ష్యంతో వారికి మునుపెన్నడూ లేని విధంగా దళిత బంధు పథకం ద్వారా రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.
తద్వారా దళితులు ప్రభుత్వం అందించే పెట్టుబడితో వ్యాపార వేత్తలుగా ఎదిగి స్వయం ఉపాధి కల్పించుకోవడమే కాకుండా, పదిమందికి ఉద్యోగాలు అందించే ఆంత్రోప్రెన్యూర్లుగా ఎదిగే విధంగా కృషి చేశామని బీఆర్ఎస్ అధినేత పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ సహా బీసీల ప్రగతి కోసం, మహిళాభ్యున్నతికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని, వాటి కొనసాగింపు ద్వారా మాత్రమే రాష్ట్రంలో బహుజన అభ్యున్నతి సాధ్యమవుతుందని కేసీఆర్ వెల్లడించారు. అప్పుడే మనం అంబేద్కర్కు ఘన నివాళి అర్పించిన వారమౌతారని కేసీఆర్ స్పష్టం చేశారు.