హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ఉద్యానవన రైతులకు కావాల్సిన పూర్తిస్థాయి విజ్ఞానాన్ని అందించేందుకు శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాజేంద్రనగర్లో ఉద్యాన రీసెర్చ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నట్టు వీసీ డాక్టర్ దండ రాజిరెడ్డి తెలిపారు. 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ ఉద్యాన రీసెర్చ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను మంగళవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనున్నట్టు చెప్పారు.
ఈ రీసెర్చ్ కాంప్లెక్స్లో కూరగాయలు, పూలు, సుగంధ, ఔషధ పంటల సాగులో విత్తనోత్పత్తి, నూతన రకాలు, పంటల అభివృద్ధి, చీడపీడల నివారణ వంటి అంశాలపై పరిశోధనలు చేసి, రాష్ట్ర రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు వీసీ దండ రాజిరెడ్డి సోమవారం ప్రకటనలో తెలిపారు.