సుల్తాన్బజార్, జూన్ 13: ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం హర్షణీయమని బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రధాని అయితే దేశంలోని 15 కోట్ల మంది బ్రాహ్మణులకు, కశ్మీరీ పండిట్లకు సముచిత గౌరవం లభిస్తుందని చెప్పారు. సోమవారం ఆయన ఆబిడ్స్లోని గాయత్రిభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలోని అర్బకులు, బ్రాహ్మణులను కేసీఆర్ ఆదుకొన్నారని వివరించారు. బీజేపీ పాలిత కర్ణాటకలో దేవాదాయ, ధర్మాదాయశాఖను తొలగించి, తమ పార్టీ నాయకులకు ఆలయాలను అప్పగించడంతో అర్చక వ్యవస్థ నిర్వీర్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు. తమది హిందుత్వ ఎజెండా అని చెప్పుకొనే బీజేపీ కర్ణాటకలో అర్చకులకు వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నదని, ఆలయాలను భ్రష్టు పట్టిస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కమ్యూనిస్టు పాలిత కేరళలో దేవాదాయ, ధర్మాదాయశాఖను సక్రమంగా నిర్వహించడం వల్ల అర్చకులకు న్యాయం జరుగుతున్నదని ప్రశంసించారు. సమావేశంలో సమితి సభ్యులు రాజేశ్వర్శర్మ, సతీశ్శర్మ, పెన్నా మోహన్శర్మ, రఘుకిరణాచార్యులు, మధుచార్యులు పాల్గొన్నారు.