KCR | హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడంతో తమకు జరుగుతున్న అన్యాయంపై ప్రజలు ఆలోచిస్తున్నారని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. పాలనను గాలికి వదిలేసి పాత ప్రభుత్వంపై నిందలు వేయడమే లక్ష్యంగా పెట్టకొని పనిచేస్తున్నారని కాంగ్రెస్ నేతలను దుయ్యబట్టారు. తెలంగాణ భవన్లో మంగళవారం మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ లోక్సభ స్థానాల పరిధిలోని పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. సమావేశానికి మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, హరీశ్ రావు, వీ శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు విజయుడు, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి మంచి విజయావకాశాలు ఉన్నాయని చెప్పారు. మూడు నెలలుగా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని, మన అభ్యర్థులందరూ మంచి మెజార్టీతో గెలుస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ కన్నా మూడునాలుగుశాతం ఓట్లు అదనంగా వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు.
రాష్ర్టాన్ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల కోసమే పనిచేస్తుందని, గెలుపోటములు రాజకీయాల్లో ఒక భాగమేనని కేసీఆర్ పేర్కొన్నారు. 2014లో బీఆర్ఎస్ అధికారం చేపట్టే నాటికి ఆర్థిక పరిస్థితిపై తాను ఎవరినీ నిందించలేదని, ఉన్నదానిని మెరుగుపరుచుకున్నామని గుర్తు చేశారు. ‘లంకెబిందెలు ఉంటాయనుకున్నాం’ అన్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలను ఉటంకిస్తూ గుప్తనిధుల కోసం వెతికే దొంగలే లంకెబిందెల కోసం వెతుకుతారని, కష్టపడే మనస్తత్వం ఉన్నవారు అలవోకగా వచ్చే సంపద కోసం ఆశపడరని చెప్పారు. ప్రభుత్వాన్ని నడిపించే క్రమంలో వెసులుబాటు కోసం అప్పులు తెచ్చుకుంటామమని, మార్కెట్ బారోయింగ్ పేరుతో ప్రపంచంలోని ప్రతి దేశం, మన దేశంలోని ప్రతి రాష్ట్రం అప్పు చేయక తప్పదని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశమైన అమెరికా కూడా అప్పులతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నదని గుర్తుచేశారు. ప్రభుత్వానికి అప్పులు ఉన్నాయనడం తెలివితక్కువతనమని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నీళ్లను పాకిస్థాన్కో, అమెరికాకో పంపలేదు కదా. ఆ నీటితోనే పుట్టలకొద్దీ పంటలు పండాయి. బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన నీటి సంరక్షణ చర్యలకు పాలమూరు మంచి ఉదాహరణ. బండలా ఉన్న పాలమూరు బంగారు తునకలా అయింది. ఇది అందరికీ కనిపిస్తున్నదే కదా.
-కేసీఆర్
బీఆర్ఎస్ సర్కారు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టినప్పుడు ట్రిబ్యునళ్లలో కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్సేనని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రాజెక్టును పూర్తిచేశామని, కాలువలు తవ్వడం మాత్రమే మిగిలి ఉన్నదని, ఈ ఎండాకాలంలో రెండు నెలలు పనిచేస్తే అవి కూడా పూర్తవుతాయని తెలిపారు. పాలమూరు కరువును తాను కండ్లారా చూశానని, 2001లో ఆర్డీఎస్ వద్ద ఆందోళనలు చేశానని గుర్తు చేసుకున్నారు. పాలమూరు ప్రజల కష్టాలు శాశ్వతంగా దూరం కావాలంటే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేయాల్సిందేనని వివరించారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందే మిషన్ కాకతీయకు రూపం ప్రత్యేక రాష్ట్రం వచ్చి తీరుతుందన్న నమ్మకంతో కొత్త రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై దివంగత ఆచార్య జయశంకర్, నీటిపారుదల రంగ నిపుణులు ఆర్ విద్యాసాగర్ మధ్య చర్చ జరిగిందని, ఆ సందర్భంగా ‘మిషన్ కాకతీయ’కు అంకురార్పణ జరిగిందని కేసీఆర్ గుర్తుచేశారు. రాష్ట్ర ఏర్పాటుకు 9 నెలల ముందే కాకతీయుల కాలంనాటి గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించాలని సంకల్పించినట్టు చెప్పారు.
కొత్త రాష్ట్రంగా ఉద్భవించిన తెలంగాన అనేక అద్భుతాలు చేసిందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేయాలన్న ఆరాటం, మమకారం బీఆర్ఎస్కు తప్ప మరొకరికి ఉండదని తెలిపారు. ప్రతీ పనిని ప్రజలపై ప్రేమతో చేశాం తప్పితే రాజకీయ ప్రచారం కోసం కాదని స్పష్టం చేశారు. దేశంలో కమ్యూనిస్టు పార్టీలు అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల కోసమే పనిచేశాయని ప్రశంసించారు. ప్రత్యేక రాష్ట్రంలో పదేండ్లపాటు అధికారంలో ఉన్న పార్టీగా బీఆర్ఎస్కు గుర్తింపు ఉన్నదని, ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే బాధ్యత కూడా బీఆర్ఎస్పైనే ఉన్నదని, కలిసి వచ్చే శక్తులన్నింటినీ ఏకం చేసుకుని వెళ్దామని చెప్పారు.
నాగర్కర్నూలు ఎంపీ పీ రాములు పార్టీ నుంచి వెళ్లిపోవడంపై కేసీఆర్ స్పందించారు. ఎక్కడో ఉన్న రాములును పిలిపించి, ఎంపీ టికెట్ ఇచ్చి పార్టీ మొత్తం వెంట ఉండి ఆయనను గెలిపించిందని చెప్పారు. రాములు కొడుకు రాజకీయాల్లోకి వస్తానంటే జడ్పీటీసీ సభ్యుడిగా అవకాశం కల్పించానని గుర్తుచేశారు. మరిన్ని అవకాశాలు కావాలంటే ఇంకేం ఇస్తామని ప్రశ్నించారు. పార్టీలో అత్యంత గౌరవం ఇచ్చామని, అలాంటి వ్యక్తి తనకు ఇంకా అవకాశాలు కావాలని అనడం అర్థరహితమని పేర్కొన్నారు. స్వార్థపరులు కొందరు పార్టీ నుంచి వెళ్లినా ఫర్వాలేదని స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో స్థానిక సంస్థల కోటాకు జరిగే ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు.
ప్రజా జీవితంలో ప్రజలతో ఉండడం ముఖ్యం. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఒక అపజయంతో కుంగిపోవద్దు. బీఆర్ఎస్కు ఎదురైన అపజయాలకు కుంగిపోతే తెలంగాణ రాష్ట్రమే వచ్చేదే కాదు. రాష్ర్టాన్ని సాధించిన వాళ్లుగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలకు రాష్ట్రంపై ప్రేమ ఎక్కువ.
-కేసీఆర్
రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని, కరెంటు కొరత తీవ్రంగా ఉన్నదని, అన్నదాతలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటికి కూడా కరువు ఏర్పడుతున్నదని, మిషన్ భగీరథ నీళ్లను కూడా సవ్యంగా వాడుకోలేకపోతున్నదంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రజలకు 8 ఏండ్ల తర్వాత కరెంటు, నీటి కష్టాలు వచ్చాయని పేర్కొన్నారు. రైతుపంటకు బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుక మడత పెడుతున్నదని, మద్దతు ధర రాకపోతేనే బోనస్ ఇస్తామంటూ ఉత్తముచ్చట్లు చెప్తున్నదని మండిపడ్డారు.
మహబూబ్నగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి మరోమారు బరిలో ఉంటారని కేసీఆర్ ప్రకటించారు. ఆయన గెలుపునకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అతిత్వరలో జిల్లాలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన ప్రణాళికను రూపొందించుకుందామని పేర్కొన్నారు. నాగర్కర్నూలు లోక్సభ స్థానం అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.