KCR | హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు మరో ఉద్యమానికి పిడికిలెత్తారు. రైతుకు బాసటగా నిలిచేందుకు బయల్దేరారు. ఆదివారం జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకోనున్నారు. తెలంగాణతో సహా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సుడిగుండంలో తిరుగుతుంటే కేసీఆర్ మాత్రం రైతుల కన్నీళ్లను తుడిచేందుకు వస్తున్నారు. బీఆర్ఎస్ ఉనికే లేకుండా చేస్తామని కాంగ్రెస్, బీజేపీ కంకణం కట్టుకొని ముందుకు సాగుతుంటే.. పంటపొలాల్లో గుండె చెదురుతున్న రైతుల్లో ధైర్యాన్ని నూరిపోసేందుకు కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. రైతు ఎజెండాయే తమ జెండా అని ముందుకు సాగుతున్నారు. అందులో భాగమే కేసీఆర్ పొలం బాట అని బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రైతన్నకు ధైర్యాన్ని ఇవ్వడం, ప్రభుత్వాన్ని మేల్కొల్పడమే ప్రతిపక్షంగా తమది బాధ్యతాయుత పాత్ర అని చెప్తున్నాయి.
నాడు, నేడు రైతన్నకు అండగా..
రైతు నోట్లో మట్టి కొట్టే రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్)పై ఆగస్టు 2003లో అప్పటి రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కేసీఆర్ కలిసి నిరసన తెలిపారు. ఆ తర్వాత అనేక దశల్లో ఆందోళనలు చేశారు. పోతిరెడ్డిపాడుకు నిరసనగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని అన్ని కలెక్టరేట్ల ముందు 2005 అక్టోబర్ 17న గులాబీ దళం ధర్నాలు చేసింది. 2006 ఫిబ్రవరి 12న పోలవరం గర్జన పేరిట భద్రాచలంలో నిర్వహించిన బహిరంగసభ జాతీయ దృష్టిని ఆకర్షించింది. దేశంలో రైతు సమస్యలపై పోరాటాలు చేస్తున్నవారికి, వాటికి సహేతుకమైన పరిష్కారాలు చూపాలని తపించేవారికి కేసీఆర్ మార్గదర్శి అని ఆ సభకు హాజరైన జేఎంఎం నేత శిబూసోరెన్ కొనియాడారు. 2003లో కేసీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోదాడ నుంచి హాలియా వరకు చేసిన పాదయాత్ర రాష్ట్ర సాధన అనంతరం 3 పంటలకు నీళ్లు ఇచ్చేందుకు దోహదం చేసింది. రాష్ట్రంలో ఏ మూలన ఏ పిల్లకాలువ పారుతుందో, ఏ నది నీటితో ఏ ప్రాంతం గొంతు తడపొచ్చు అన్నది కేసీఆర్కు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదని విశ్లేషకుల మాట.
ఆ పోరాటాల స్ఫూర్తితోనే: బీఆర్ఎస్
బీఆర్ఎస్కు ఎన్నికల కన్నా రైతుల కన్నీళ్లు తుడవటమే ముఖ్యమని బీఆర్ఎస్ నేతలు తేల్చిచెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో రైతుభరోసా, రుణమాఫీ హామీలు ఇచ్చి రైతులను నమ్మించిన కాంగ్రెస్.. మాట నిలుపుకోకపోవటంతోనే రైతాంగం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నదని తెలిపారు. అధికారంలోకి రాగానే ఆ పార్టీ అన్నింటినీ విస్మరించిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 120 రోజులు కావొస్తున్నా, ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పోరాటాల స్ఫూర్తితో రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలవాలని కేసీఆర్ పొలంబాట పట్టారని, ఆదివారం నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన చేయనున్నారని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు మొదలుకొని, అవసరమైతే లక్షల మంది రైతులతో సెక్రటేరియట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అందుకు అంకురార్పణే కేసీఆర్ జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పర్యటన అని పేర్కొన్నారు. పంటల విస్తీర్ణం, ఎండిన పంట విస్తీర్ణం, రైతుల స్థితిగతులను బేరీజు వేసి గ్రామాలు, మండలాల వారీగా తెలంగాణభవన్కు సమాచారం పంపిస్తే దాన్ని క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించింది. రైతులెవరూ బలవన్మరణాలకు పాల్పడకూడదని, ప్రభుత్వం మెడలు వంచి రైతులను ఆదుకుంటామని స్పష్టం చేసింది.
కేసీఆర్ పర్యటన రూట్మ్యాప్
ఉదయం 8.30 గంటలకు ఎర్రవల్లి నుంచి కేసీఆర్ బయల్దేరి 10.30 గంటలకు జనగామ జిల్లా దేవరుప్పల మండలం ధరావత్తండాకు చేరుకుంటారు. అక్కడ ఎండిపోయిన పొలాలను పరిశీలించి, రైతుల సమస్యలు తెలుసుకుంటారు. ఉదయం 11.30 గంటలకు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోకి ప్రవేశిస్తారు. తుంగతుర్తితో పాటు అర్వపల్లి, సూర్యాపేట మండలంలో ఎండిన పంటలను పరిశీలించి, మధ్యాహ్నం 1.30 గంటలకు ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసి, 3 గంటలకు మీడియా సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 3.30 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి సాయంత్రం 4.30 గంటలకు నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూరుకు చేరుకుంటారు. అక్కడ పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడుతారు. సాయంత్రం ఆరు గంటలకు బయల్దేరి నల్లగొండ మీదుగా రాత్రి 9 గంటలకు ఎర్రవల్లి చేరుకుంటారు.
నాలుగెకరాలూ ఎండిపాయే
నేను 4ఎకరాలలో వరి ఏసిన. పంట చేతికొస్తదనుకుంటే నీళ్లు లేక మొత్తం ఎండిపాయే. సుమారు రూ. 2 లక్షలు పెట్టుబడి నష్టం అయింది. 3 బోర్లు ఏసినా ఒకటే పడింది. చెరువుల నీళ్లుంటేనే బోరు పోస్తది.చెరువుల నీరు లేక వరి పంట మొత్తం ఎండిపోయింది. కేసీఆర్ ప్రభుత్వంల కాల్వలు పారినయి.. చెరువులకు నీళ్లొచ్చినయి. కాంగ్రెస్ వచ్చినంక కాల్వల్లో నీళ్లు రాక చెరువులు ఎండినయి. పంటలు పోయినయి. ఎండిన పొలానికి పంటనష్టం అందజేసి ఆదుకోవాలి.
– భోగి వెంకటమల్లయ్య, రైతు, మల్కాపూర్, జనగామ