హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): సర్వజన హితమే తమ పార్టీ లక్ష్యమని బీఆర్ఎస్ నేత, ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్బాబు స్పష్టం చేశారు. దేశంలో కేవలం కొన్ని వర్గాలకు కొమ్ముకాసి మిగిలిన అన్ని వర్గాలను అణచివేయడమే ప్రధాని నరేంద్రమోదీ విధానంగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. దేశాన్ని మోదీ విచ్ఛిన్నం చేస్తుంటే.. కేసీఆర్ మాడల్ దేశాన్ని వికాసం వైపు తీసుకెళ్తుందని, దేశాన్ని గాడిలో పెట్టగల సత్తా, దార్శనికత కేసీఆర్కే ఉన్నదని పేర్కొన్నారు. ఇటీవల బీఆర్ఎస్లో చేరిన రావెల.. బుధవారం నమస్తే తెలంగాణ తో మాట్లాడారు. ప్రజాఉద్యమాలు, దళిత ఉ ద్యమాలతో మమేకమైన తనకు కేసీఆర్లో రా జ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన, ఆచరణ వాదం కనిపిస్తున్నాయని చెప్పా రు. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రబల శక్తిగా ఎదగడం ఖాయమన్నారు. కులాల కుంపట్ల నుంచి ఏపీని రక్షించి అభివృద్ధి, సంక్షేమంవైపు నడపగల నేర్పు కేసీఆర్లో ఉన్నదని చెప్పారు.
అభివృద్ధిలో తెలంగాణకు, ఏపీకి పోలికలేదు
అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో తెలంగాణకు, ఏపీకి పోలికే లేదని రావెల పేర్కొన్నారు. ఆం ధ్రాలో కులవర్గ పోరాటాలే తప్ప అన్ని వర్గాలను బాగుచేయాలన్న తపనే అక్కడి పాలకులకు లేదన్నారు. దేశంలో ఉత్తరప్రదేశ్ తరువాత కులపోరాటాలు అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రంగా ఆంధ్రాకు అపఖ్యాతిని మూటగట్టిన పాపం ఏపీ పాలకులదేనని విమర్శించారు. ఓ వైపు చంద్రబాబు, మరోవైపు జగన్ పోటాపోటీగా అరాచకాన్ని పెంచిపోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ర్టా న్ని సాధించి అనతికాలంలోనే దేశం గర్వించదగ్గస్థాయిలో నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు. దాదాపు పదేండ్లు కావస్తున్నా ఏపీలో రాజధానిని నిర్మించలేదని మండిపడ్డారు. రాయలసీమ నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినా ఆ ప్రాంత ప్రజల తాగునీటి కష్టాలను తీర్చలేకపోయారని కేసీఆర్ ఆవేదన చెందుతున్నారని తెలిపారు.
పెట్టుబడులు వెనక్కి ఎందుకు పోతున్నాయి?
ఆంధ్రాకు దేశ, విదేశాల నుంచి పెట్టుబడులు వచ్చినట్టే వచ్చి ఎందుకు వెనక్కిపోతున్నాయని రావెల ప్రశ్నించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన సింగపూర్, మలేషియా, దక్షిణ కొరియా తదితర దేశాల వ్యాపారవేత్తలు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవటానికి రాష్ట్ర పాలకులే కారణమని పేర్కొన్నారు. ఏపీని సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు ఆర్థికంగా, సామాజికంగా కుంగదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంబేద్కర్ ఆలోచనా విధానమే కేసీఆర్ ఆచరణవాదం
భారత్కు స్వాతంత్య్రం లభించాక ప్రపంచ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి యావత్ దేశానికి ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని కేసీఆర్ తన ఆచరణవాదంగా పెట్టుకున్నారని రావెల పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో జరుగుతున్న పరిణామాలు, ఆయా దేశాల్లో ప్రజల సంక్షేమం కోసం పాలకులు అనుసరిస్తున్న విధానాలతోపాటు మన దేశంలోని ఆర్థిక, సామాజిక పరిస్థితులపై కేసీఆర్కు స్పష్టమైన అవగాహన, విజన్ ఉన్నదని చెప్పారు. ఈ క్రమంలోనే దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో దళితబంధు పథకాన్ని అమలు చేస్తూ దళితజాతికి వెలుగు బాటలు వేశారని, అందుకే ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయని తెలిపారు.
విచ్ఛిన్నం నుంచి వికాసం వైపు దేశాన్ని నడపాలె
కులాలు, మతాల పేరుతో దేశాన్ని విభజించి పాలించాలని మోదీ చూస్తున్నారని రావెల మండిపడ్డారు. అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మార్చారని విమర్శించారు. దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమాల్లో 22 మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితర బీజేపీ పాలిత రాష్ర్టాల్లో బలహీన వర్గాలపై, ప్రత్యేకించి దళిత మహిళలపై కొనసాగుతున్న దాడులు, వివక్షపై యావత్ దేశం తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయన్నారు. దేశంలోని సామాజిక, ఆర్థిక రుగ్మతలపై పోరాడి విజయం సాధించగల సత్తా బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కే ఉన్నదని రావెల స్పష్టం చేశారు.
దేశాన్ని కేసీఆర్ గాడిలో పెట్టగలరు
హైదరాబాద్లో పెట్టుబడులు పెడుతున్న ఆంధ్రా వ్యాపారవేత్తలు సొంత పెట్టుబడులు పెట్టకపోవటానికి అక్కడి పాలకుల కొట్లాటలే కారణమని రావెల పేర్కొన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ ఆంధ్రాతోపాటు దేశాన్ని సైతం గాడిలో పెట్టగలరని ఏపీ ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని తెలిపారు. దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించి భారత్ను సరైన దశ దిశలో నడపగల నాయకత్వ పటిమ, విజన్ కేసీఆర్లోనే ఉన్నదని స్పష్టం చేశారు.