కమ్మర్పల్లి, అక్టోబర్ 1 : దేశంలోనే నంబర్ వన్ సెక్యులర్ లీడర్ సీఎం కేసీఆర్ అని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణలో గంగా జమునా తెహజీబ్లా కేసీఆర్ పాలన సాగుతున్నదని కొనియాడారు. పేద ముస్లిం పిల్లలకు విరివిగా గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసి వారు సైతం ప్రపంచంతో పోటీ పడేలా కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారని అన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లక్కోరాలో ఏఎన్జీ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ ముస్లిం మైనార్టీలకు మజీద్ల అభివృద్ధి కోసం రూ.3 కోట్ల నిధుల ప్రొసీడింగ్ కాపీలను ఆదివారం హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ గాంధేయ మా ర్గంలో తెలంగాణను సాధించి అనతి కాలంలోనే దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దినట్టు చెప్పారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ ముస్లిం పిల్లలు విద్యలో ప్రపంచంతో పోటీ పడాలనేదే కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. వారు డాక్టర్లు, ఇంజినీర్లు, పైలట్లు, సైంటిస్టులు, మేధావులుగా ఎందుకు కాకూడదనే ఉద్దేశంతో గురుకుల పాఠశాలలు నెలకొల్పినట్టు చెప్పారు. రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. 300 కుట్టుమెషిన్లను మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్తో కలిసి పంపిణీ చేశారు. అనంతరం మంత్రి వేముల బాల్కొండ మం డలం చిట్టాపూర్లో రూ.149 కోట్లతో చేపట్టిన బాల్కొండ, చిట్టాపూర్, సుర్బిర్యాల్ ఎత్తిపోతల పనులకు శంకుస్థాపన చేశారు.హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధు శేఖర్, బీఆర్ఎస్ రాష్ట్ర నేత కోటపాటి నర్సింహనాయుడు పాల్గొన్నారు.