KCR | హైదరాబాద్, మార్చి 31(నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ హామీ ఇచ్చిన రుణమాఫీ ఏమైంది, డిసెంబర్ 9 దాటి ఎన్ని రోజులైంది?’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నదని, ముఖ్యమంత్రి ఎక్కడ నిద్రపోతున్నారని ప్రశ్నించారు. ఆదివారం ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “ ఈ ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు రుణమాఫీపై ఏం చెప్పారో అందరికీ తెలుసు. కేసీఆర్ కొంత మాఫీ చేశారు కదా, ఇగ బ్యాంకులకు లగెత్తండి. పరుగెత్తండి రూ. 2 లక్షల రుణం తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు మొత్తం మాఫీ చేస్తా అన్నడు. ‘వెన్ డిసెంబర్ 9 యాస్ గాన్ మిస్టర్ చీఫ్ మినిస్టర్.. వేర్ ఆర్ యూ స్లీపింగ్. ఐయామ్ ఆస్కింగ్ యూ. బ్యాంకోళ్లు వచ్చి పైసలు కట్టమని రైతులను అడుగుతున్నారు. ‘సార్ రేవంత్రెడ్డి డిసెంబర్ 9న మాఫీ చేస్తమన్నడు కదా’ అని చెబితే బ్యాంకు వాళ్లు మాత్రం ‘రేవంత్రెడ్డి గీవంత్రెడ్డి జాన్తా నై. అవన్నీ మాకు సంబంధం లేదు. నువ్వు కట్టాల్సిందే. ప్రభుత్వాన్ని మాకు డబ్బులు ఇవ్వమనండి. అప్పుడు మేం వసూలుకు రాం’ అని చెబుతున్నారు. రుణాలు చెల్లించాలని నోటీసులు ఇచ్చి రైతులను సతాయిస్తున్నారు. రూ. 2 లక్షల రుణమాఫీ ఏమైంది? ఎప్పుడు చేస్తరో ఎందుకు చెప్పడం లేదు? రైతులకు బ్యాంకులు నోటీసులిస్తే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడడం లేదు? వీటికి సమాధానం కావాలి. రైతులు, ప్రజల పక్షాన అడుతున్నాం. మీ ఇష్టమొచ్చిన వాగ్దానాలు చేసి, ప్రజలను గోల్మాల్ చేసి కేవలం 1.8 శాతం ఓట్లతో గట్టెక్కి ప్రభుత్వంలోకి వచ్చారు. మిమ్మల్ని ఎట్లా ఒదిలిపెడుతాం. తరిమితరిమి కొడుతాం. నిద్రకూడా పోనివ్వం.
పంటలు ఎండి రైతులు నష్టపోతే.. సీఎం ఢిల్లీ యాత్రలా
ఈ ప్రభుత్వం ఏదీ పట్టించుకోకుండా, దేనిపైనా సమీక్షలు చేయకుండా అడ్డగోలు మాటలు, పిచ్చి ప్రచారాలు చేసుకుంట ఎంతసేపూ గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే చీప్ ట్యాక్టిక్స్ తప్ప ఏమీ కనపడతలేదు. ఆనాడు ఖమ్మంతోపాటు అనేక జిల్లాల్లో రాళ్లవాన వచ్చి పంటనష్టం జరిగింది. ఆనాడు పరిహారం కోసం కేంద్రానికి నివేదిక పెట్టాలె. రైతుల పరిస్థితి దిగజారకూడదని చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా నేను ఎకరానికి రూ. 10వేల చొప్పున ఇచ్చాను. ఆ పొలంలోనే అప్పటికప్పుడు ప్రకటించి ఐదారు రోజుల్లోనే రైతులకు రూ. 149 కోట్లు అప్పడు పంపిణీ చేశాం. ఇలా పలు దఫాలుగా సుమారు రూ. 500 కోట్లు రైతులకు నష్ట పరిహారం పంచినం. ఇవాళ రాళ్లవాన పడితే అడిగే దిక్కులేదు. ఒక మంత్రి పోడు, ఒక ఎమ్మెల్యే పోడు. ఎంపీపోడు, దొంగలు ముఖం చాటేసినట్టు. ముఖ్యమంత్రికి పట్టేలేదు. ఆయనకు ఢిల్లీయాత్రలే సరిపోతున్నయ్. అధికారుల బృందాలను పంపరు.