హైదరాబాద్, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఇచ్చిన మరో హామీ కొద్దిరోజుల్లోనే అమలుకు నోచుకున్నది. మే 31న గోపన్పల్లిలో బ్రాహ్మణ సంక్షేమ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ధూప దీప నైవేద్యం పథకం అర్చకులకు ఇచ్చే గౌరవ భృతిని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచనున్నట్టు ప్రకటించారు. సీఎం ఆదేశాల ప్రకారం ప్రభుత్వానికి దేవాదాయ శాఖ కమిషనర్ ప్రతిపాదనలను పంపారు. ఆ ప్రతిపాదనలకు తాజాగా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రూ.4,000 ధూప దీప నైవేద్యానికి, రూ.6,000 అర్చకుల వేతనాలు కలిపి రూ.10 వేలకు పెంచుతూ మంగళవారం ప్రభుత్వ కార్యదర్శి వీ అనిల్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా 6,541 మంది అర్చకులకు ప్రయోజనం చేకూరనున్నది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నది. తమ మేలు కోసం నిర్ణయం తీసుకొన్న ముఖ్యమంత్రికి అర్చక సంఘాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.
ప్రభుత్వంపై ఏటా రూ.31.39 కోట్ల అదనపు భారం
ధూపదీప నైవేద్య పథకం కింద గతంలో 6,541 మంది అర్చకులకు నెలకు రూ.6,000 వేల చొప్పున ప్రభుత్వం ఏటా 47.09 కోట్లు చెల్లించేది. ఇక నుంచి రూ.78.49 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వంపై అదనంగా రూ.31.39 కోట్ల భారం పడనున్నది. అర్చకుల శ్రేయస్సు, ఆలయాల్లో ధూప దీప నైవేద్య కార్యక్రమాలు జరగాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ వేతనాలను పెంచాలని నిర్ణయించారు. ధూప దీప నైవేద్య (డీడీఎన్) పథకం గౌరవ భృతిని 10 వేలకు పెంచడాన్ని హర్షిస్తూ హైదరాబాద్లో అర్చక సమాఖ్య గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అన్ని కులమతాలను సమానంగా ఆదరిస్తున్న కేసీఆర్ పదికాలాలపాటు అధికారంలో కొనసాగాలని కాంక్షిస్తూ బుధవారం అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ధూప దీప నైవేద్య అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్శర్మ, నారాయణస్వామి, ఆంజనేయాచారి, మహేంద్రాచారి, మోహన్ శర్మ, నవీన్ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ గొప్ప మనసుకు నిదర్శనం: ఇంద్రకరణ్రెడ్డి
ఇచ్చిన మాట ప్రకారం ధూప దీప నైవేద్య పథకం వేతనాలను రూ.10 వేలకు పెంచడం సీఎం కేసీఆర్ గొప్ప మనసుకు నిదర్శనమని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కొనియాడారు. ఉమ్మడి పాలనలో అర్చకులకు డీడీఎన్ కింద నెలకు కేవలం రూ.2,500 మాత్రమే ఇచ్చేవారని, సీఎం కేసీఆర్ ఈ మొత్తాన్ని మొదట రూ.6000కు పెంచారని, తాజాగా రూ. 10,000కు పెంచారని గుర్తుచేశారు. గతంలో 1,805 ఆలయాలకు మాత్రమే డీడీఎన్ పథకం అమలుచేసే వారని, ప్రస్తుతం 6,541 ఆలయాలకు అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఆలయాలకు విస్తరించాలనే ప్రతిపాదన ఉందని తెలిపారు. రూ.10 వేల పెంపుతో డీడీఎన్ పథకానికి ఏటా రూ.78.49 కోట్లు ఖర్చవుతుందని మంత్రి తెలిపారు.
అర్చకుల వేతన పెంపు హర్షణీయం: దౌల్తాబాద్
ధూప దీప నైవేద్య పథకం అర్చకుల ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ వారి గౌరవ భృతిని రూ.10 వేలకు పెంచడం హర్షణీయమని డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 2,500 ఉన్న గౌరవభృతిని కేసీఆర్ రూ.10 వేల వరకు పెంచారని తెలిపారు. గతంలో కేవలం 1,800 ఆలయాలకు మాత్రమే ఉన్న ఈ పథకాన్ని ఆరున్నర వేల ఆలయాలకు విస్తరించిన ఘనత కూడా సీఎం కేసీఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు : శ్రీరంగం గోపి
పెద్ద మనసుతో అర్చకుల వేతనాలు పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్కు డీడీఎన్ అర్చక సంఘం కన్వీనర్ శ్రీరంగం గోపి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం అర్చకుల గౌరవ భృతిని పెంచడంతో రాష్ట్రవ్యాప్తంగా అర్చకులు ఆనందంలో మునిగి తేలుతున్నారని తెలిపారు. అంతటా సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇచ్చిన మాట నిలుపుకొన్న కేసీఆర్: కేవీ రమణాచారి
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): బ్రాహ్మణ సదన్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకొన్నారని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ కేవీ రమణాచారి కొనియాడారు. ధూపదీప నైవేద్య పథకం కింద అర్చకులకు ఇచ్చే గౌరవభృతిని పెంచడమే కాకుండా ఈ పథకంలో ఉన్న ఆలయాల సంఖ్యను పెంచినందుకు ఆయన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సనాతన సంప్రదాయాలకు మొదటి నుంచి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు.