Jagtial | జగిత్యాల, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): అదొక మారుమూల గ్రామం. అక్కడ ఒక పోలియో బాధితుడు. ఆయన భార్య కూడా పుట్టు మూగ. తల్లిదండ్రులు వృద్ధులు. వారికి ఏ ఆధారమూ లేదు. అలాంటి సమయంలో వారికి అండగా నిలిచింది కేసీఆర్ ప్రభుత్వం. ఒకవైపు వృద్ధాప్య, దివ్యాంగ పింఛన్లకు తోడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం మంజూరు చేసి వారి జీవితాలకు ఆలంబనగా నిలిచింది. ఆ దివ్యాంగ దంపతులు సాగిస్తున్న జీవనయానం, కష్టాలకు ఎదురొడ్డి నిలిచిన తీరు అందరికీ ఆదర్శనీయం. మాడిశెట్టి రాజుది జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోధూర్ గ్రామం. వారిది నిరుపేద కుటుంబం. తండ్రి భూమయ్య వ్యవసాయ కూలి. తల్లి రాజవ్వ బీడీ కార్మికురాలు. వీరు వృద్ధులయ్యారు. రాజుకు పోలియో సోకడంతో దివ్యాంగుడయ్యాడు. చిన్నప్పటి నుంచీ కష్టపడి పనిచేసి బతకాలనే తపన ఉండేది. రాజు గోధూర్ సమీపంలోని బండ లింగాపూర్లోని ఒక చిన్న హోటల్లో పనికి కుదిరాడు. అక్కడే చాయ్, కాఫీ, టిఫిన్లు తయారుచేయడం నేర్చుకున్నాడు.
ఈ నేపథ్యంలోనే మల్లాపూర్ మండలం గొర్రెపల్లికి చెందిన లతను పెండ్లి చేసుకున్నాడు. ఆమె కూడా విధి వంచితురాలే. పుట్టుకతోనే మూగ. మాటలు రావు. చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. తండ్రి మరో పెండ్లి చేసుకున్నాడు. లత గొర్రెపల్లిలోని అమ్మమ్మ వద్ద పెరిగింది. వారు సైతం నిరుపేదలే కావడంతో రాజుకు ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు. ఈ నేపథ్యంలో 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించడం మాడిశెట్టి రాజు దంపతులకు, కుటుంబానికి మేలి మలుపైంది. రాజు తండ్రి భూమయ్యకు వృద్ధాప్య పింఛన్, తల్లి రాజవ్వకు బీడీ పెన్షన్, రాజు, లత దంపతులకు దివ్యాంగ పెన్షన్ మంజూరైంది. దీంతో రాజు కుటుంబ సభ్యులందరికీ కొంత ఆర్థిక సాయం లభించినట్టయ్యింది. రాజు-లత దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు.
పెద్ద కూతురు రిషిక ఇబ్రహీంపట్నం మండలం కస్తూర్బా పాఠశాలలో ఏడో తరగతి, చిన్న కూతురు రిచిత గోధూర్లోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుకొంటున్నది. రాజు-లత దంపతులు కేవలం పింఛన్పై ఆధారపడకుండా సొంతంగా ఉపాధి చూసుకోవాలని భావించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దివ్యాంగుల కోటాలో రూ.లక్ష రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. రుణం మంజూరు చేస్తే టీస్టాల్ పెట్టుకుంటానని తెలియజేశాడు. రాజు పట్టుదలను చూసిన కార్పొరేషన్ 80% సబ్సిడీతో రూ.లక్ష రుణం మంజూరు చేసింది. దీంతో రాజు-లత దంపతులు గోధూర్లో చిన్న టీస్టాల్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయం వల్లే మేం ఈరోజు ఆనందంగా ఉన్నాం. నాపట్ల దేవుడు చిన్నచూపు చూశాడు. అయినా, నేను కుంగిపోలేదు. నేను, నా భార్య ఇద్దరం కలిసి కష్టపడి బతికేందుకే ప్రయత్నించాం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత మా కుటుంబ సభ్యులందరికీ కలిపి తొలుత నెలకు రూ.5 వేలు, ఆ తర్వాత రూ.12 వేలకుపైగా పెన్షన్ రావడంతో ఇబ్బందులు పోయాయి. కేవలం పెన్షన్పై ఆధారపడి బతకడం మంచిది కాదని ఎస్సీ కార్పొరేషన్ సాయంతో చాయ్ హోటల్ పెట్టుకొని బతుకుతున్నం. అన్ని ఖర్చులు పోను నెలకు నాలుగైదువేలు మిగులుతున్నాయి. నా బిడ్డలను సర్కార్ బడిలో చదివిపిస్తున్నా. కొంచెం పెద్ద మొత్తంలో రుణం లేదా సాయం అందితే టిఫిన్ సెంటర్ పెట్టి, మరో ఇద్దరు ముగ్గురికి ఉపాధి చూపించాలని ఉన్నది. మాది చిన్న పెంకుటిల్లు. తల్లిదండ్రులు అందులోనే ఉంటున్నరు. వారి కోసం ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా.
– మాడిశెట్టి రాజు, దివ్యాంగుడు, గోధూర్, ఇబ్రహీంపట్నం మండలం, జగిత్యాల జిల్లా