కమ్మర్పల్లి/జగిత్యాల కలెక్టరేట్, జనవరి 10: కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ సర్కారు రద్దు చేయడంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. అప్పట్లో తమకు ఇచ్చిన ప్రొసీడింగ్ కాపీల ప్రకారం ఇల్లు వస్తుందా? రాదా? అన్న ఉత్కంఠ నెలకొన్నది.
ఈ నేపథ్యంలోనే ‘గృహలక్ష్మి’ లబ్ధిదారులు బుధవారం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్, వేల్పూర్ తహసీల్ కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగారు. కాగా జగిత్యాల కలెక్టరేట్ ఎదుట జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ మండలాల లబ్ధిదారులు ధర్నా చేశారు. తమకు మంజూరైన ఇండ్లను రద్దు చేయొద్దని విన్నవించారు. ఒకవేళ ఇందిరమ్మ ఇండ్ల పథకం తీసుకొస్తే తమకే తొలి ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ చేశారు.