KCR | అయితే దేవుడిపై ఓట్లు.. లేకపోతే కేసీఆర్పై తిట్లు.. ఐదునెలలుగా ఇదే దుకాణం అంటూ సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన రోడ్షో నిర్వహించారు. జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ను ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ కల్యాణలక్ష్మి రూ.లక్ష ఇస్తున్నడు. మేం తులం బంగారం కలిపి ఇస్తం అన్నరు. ఎక్కడైనా తులం బంగారం వచ్చిందా? రైతుబంధు అందరికి పడ్డదా? మొన్న ముఖ్యమంత్రి 9వ తారీఖులోపల వేస్తం అన్నడు మరి వచ్చిందా? అని ప్రశ్నించగా రాలేదని జనం నినదించారు. ‘ఇగ రాదు. ఆయననే కుట్ర చేసి ఎలక్షన్ కమిషన్కు తెలియజేసి.. మళ్లీ ఆయననే బ్యాన్ చేసిండు. ఇప్పుడు ఏం అంటడు ? రైతుబంధు రాదు. దాని కథ ఒడిసిపోయింది’ అన్నారు.
‘మళ్లీ రేపు ఏమంటడు. ఐదెకరాలు ఉన్నోడికి వేస్తా అని మాట్లాడుతడు. ఆరెకరాల రైతు, ఏడెకరాల రైతు ఏం తప్పు చేసిండు? ఈ రకంగా రైతుబంధు ముంచిన్రు. కరెంటు కోతలు ఉన్నయా? పొలాలు ఎండినయా? కామారెడ్డిలో బాగా ఎండినయట నిజమేనా? మరి కరెంటు ఏమైందని నేను అడుగుతున్న. కేసీఆర్ ఉన్నప్పుడు తొమ్మిది సంవత్సరాలు రెప్పపాటు పోకుండా కరెంటు ఎంత బాగా వచ్చింది ? మరి ఇప్పుడు ఏం మాయరోగం వచ్చింది? ఎక్కడికిపోయింది మన కరెంటు ? ఇప్పుడు దానిపై ఉల్టా పల్టా మాట్లాడడమే తప్ప ఏం లేదు. మంచినీళ్లు సరిగా వస్తున్నయా? మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కామారెడ్డిలాంటి పట్టణాల్లో ఒక్క రూపాయికే పేదలకు నల్లా కనెక్షన్ ఇచ్చి, గ్రామాల్లో ఫ్రీగా కనెక్షన్ ఇచ్చి బ్రహ్మాండంగా నీళ్లు సరఫరా చేశాం. ఎక్కడికి పోయినయ్ నీళ్లు ? ఏం రోగం వచ్చింది దానికి? దయచేసి అందరూ ఆలోచించాలి. కరెంటు పోయింది. మంచినీళ్లుపోయినయ్. వడ్లు కొంటున్నరా? రూ.500 బోనస్ వస్తున్నదా? బోనస్ బోగస్ అయిపోయింది?’ అంటూ విమర్శించారు.
‘ముఖ్యమంత్రి ఓ మాట చెప్పిండు. కేసీఆర్ ఉన్నప్పుడు రూ.లక్ష మాఫీ చేసిండు. నేను రూ.2లక్షలు మాఫీ చేస్తా.. డిసెంబర్ 9నాడే సంతకం పెడతా.. మీరు బ్యాంకులకు వెళ్లి రూ.2లక్షల అప్పు తెచ్చుకోమన్నడు. మరి రూ.2లక్షల రుణమాఫీ వచ్చిందా? రుణమాఫీ కాలేదా? ఇప్పుడు ముఖ్యమంత్రి ఊరికిపోతే ఆ ఊరి దేవుడిపై ఒట్టు వేస్తున్నడు. చేసే సిపాయి ఎవడన్న ఒట్లు పెట్టుకంటడా? ఒట్లు పెట్టుకునుడు.. కేసీఆర్ను తిట్లు తిట్టు తప్ప ఇంకో ముచ్చట లేదు. అయితే దేవునిమీద ఒట్లు. లేకపోతే కేసీఆర్పై తిట్లు. ఇదే కథ కదా? ఐదునెలలుగా ఇదే దుకాణం. ఇగ ఆడబిడ్డలకు రూ.2500 నెలకు ఇస్త అన్నడు వచ్చినయా? కామారెడ్డిలో వచ్చినయట కదా? హైదరాబాద్లో చెబుతున్నరు. ఇట్ల ఏ మాట కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అని చెప్పి ఏ మాట కూడా నిలబెట్టుకోలేదు. అది నిలబెట్టుకోకుంటే నిలబెట్టుకోకపోయారు. పాత రైతుబంధు కూడా ఇవ్వలేదు. పంటలు కోసే సమయం వచ్చినా ఇవ్వలేదు’ అంటూ మండిపడ్డారు.