హైదరాబాద్ : మరికొద్ది గంటల్లో సుదీర్ఘ ఎన్నికల ప్రచారయాత్ర ప్రారంభం కానుండగా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలముందుకు వచ్చారు. రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో, దాని వెనుక ఏం దాగున్నదో కుండబద్ధలు కొట్టారు. 14ఏండ్ల తర్వాత టీవీ9 స్టూడియోకి వచ్చిన కేసీఆర్.. లైవ్ డిబేట్లో అనేక అంశాలపై చెలరేగిపోయారు. ధాటిగా, ఘాటుగా, దీటుగా ప్రతిస్పందించారు. సవివరంగా, సాధికారికంగా సమాధానమిచ్చారు. ఇటీవలి పలు పరిణామాలపై తొలిసారిగా కేసీఆర్ స్పందించారు. ప్రభుత్వ ఆరోపణల్లోని డొల్లతనాన్ని బయటపెట్టారు. జనంలో మెదులుతున్న ప్రశ్నలకు జవాబిచ్చారు. ఇది నాలుగుగంటల పొలిటికల్ మారథాన్ డిబేట్. తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో ఇంత సుదీర్ఘం గా టీవీ లైవ్లో మాట్లాడిన రాజకీయ నేత కేసీఆర్ ఒక్కరే. ఓ యాగంలా చేపట్టిన తెలంగాణ పునర్నిర్మాణం.. కాంగ్రెస్ చేతిలో ఎలా ఆగం అయ్యిందో కేసీఆర్ కండ్లకు కట్టారు. రెండు పిల్లర్లు కుంగితే.. మహా కాళేశ్వరానికి మరక అంటబోదని సుదీర్ఘంగా విశ్లేషించారు. కేసీఆర్ మీద కక్షతో కాంగ్రెస్ ఎలా వికృత రాజకీయ క్రీడకు దిగుతున్నదో ససాక్ష్యంగా ఆయన బయటపెట్టారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విఫల యత్నాలను చిల్లర రాజకీయ వికృత క్రీడగా కేసీఆర్ కొట్టిపారేశారు. కాకా, బాకా మీడియా సాగిస్తున్న విషప్రచారాన్ని ఎండగట్టారు. లోక్సభ ఎన్నికల్లో 8 నుంచి 12 సీట్లు గెలవబోతున్నామని కేసీఆర్ ధీమా వ్యక్తంచేశారు. వివిధ అంశాలపై కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
ఫోన్ట్యాపింగ్ సిల్లీ, థర్డ్ క్లాస్ ఆరోపణ. లా అండ్ ఆర్డర్ కాపాడటానికి, ప్రతీప శక్తులను అడ్డుకోవడానికి పలు మార్గాల్లో పోలీసులు సమాచారం సేకరిస్తుంటారు. అందులో ఇంటర్సెప్షన్ ఒకటి. అది అధికారికంగా చేస్తారు. ‘ఫలానా వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేసినం’ అని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పరు. సీఎంకు సంబంధముండదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రికీ రోజూ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ వస్తుంది. దీన్నికూడా రాజకీయం చేయడమంత దివాళాకోరుతనం ఇంకోటి ఉండదు.
లిక్కర్ స్కామ్ బోగస్. అది మోదీ పొలిటికల్ స్కీమ్. అన్ని రాష్ర్టాల్లోలాగానే అది ఢిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీ. స్కామ్ ఎట్లయితది? అందులో ఒక్క రూపాయైనా దొరికిందా? కవితకు లిక్కర్ స్కామ్కు సంబంధం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలును అడ్డుకున్నందుకే కక్షగట్టి.. గాల్లో ఓ కట్టుకథ అల్లి ఈ కేసును ముందుకు తెచ్చారు. కవిత నిర్దోషి. కడిగిన ముత్యంలా బయటకొస్తది.
మాది దొరలపాలన అంటారా..? దర్జాగా కాలు మీద కాలేసుకుని.. రైతు నడి ఇంట్ల పన్నది దొరలపాలనా? ప్రపంచంలో ఎక్కడా లేనట్టు దళితుల కోసం దళితబంధు తెచ్చింది దొరలపాలనా? పేద విద్యార్థుల కోసం 1100 గురుకులాల పెట్టిందీ, 20లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చింది దొరలపాలనా? 200 పెన్షన్ను 2వేలు చేసింది దొరలపాలనా? కేసీఆర్ కిట్ ఇచ్చిందీ, బస్తీ దవాఖానలు పెట్టిందీ దొరల పాలనా? రైతు కోసం ధాన్యం కొన్నది దొరలపాలనా? మాది ముమ్మాటికీ మానవీయ పాలన! ఎవరిది అహంకారం? మాదా.. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడ్తామంటున్నవాళ్లదా? వడ్లు కొనని, కరెంటు ఎగబెట్టిన ముఖ్యమంత్రిదా?