మహబూబ్నగర్ మెట్టుగడ్డ, అక్టోబర్ 2: సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో పచ్చదనం భారీగా పెరిగిందని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. హరితహారం కార్యక్రమంతో అటవీ విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగిందని తెలిపారు. సోమవారం మహబూబ్నగర్ సమీపంలోని అప్పనపల్లిలో కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో రూ.2.70 కోట్లతో నిర్మించే బర్డ్స్ ఎన్క్లోజర్కు ఎంపీ సంతోష్తో కలిసి మంత్రి భూమిపూజ చేశారు. 26 వేల ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద జంగల్ సఫారీని, డిస్కవరీ చానల్ తరహా రెండు సఫారీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. సఫారీ వాహనంలో వాచ్టవర్ వరకు వెళ్లి టవర్పైకి చేరుకొని అటవీ అందాలను తిలకించారు. అనంతరం మహబూబ్నగర్లోని అయ్యప్ప కొండ వద్ద జంజారా సేవాలాల్ మహరాజ్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తర్వాత పాలమూరులో మినీట్యాంక్బండ్పై నిర్మించిన ఎయిర్ సస్పెన్షన్ బ్రిడ్జిని మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ సంతోష్ ప్రారంభించారు. డ్రోన్, లేజర్షోను షురూ చేసి ప్రజలతో కలిసి వీక్షించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. పచ్చదనాన్ని పెంచి పర్యావరణాన్ని కాపాడుతున్న ప్రకృతి ప్రేమికుడు ఎంపీ సంతోష్ ప్రశంసించారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఎంతో అద్భుతంగా అభివృద్ధి జరిగిందని చెప్పారు. ఎంపీ సంతోశ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఎకో పార్కును ప్లాస్టిక్ ఫ్రీ పార్కుగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ఔత్సాహిక ప్రకృతి ప్రేమికులకు అందుబాటులోకి వచ్చిన మరో డెస్టినేషన్ కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు అని పేర్కొన్నారు. 26 వేల ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద జంగల్ సఫారీని నగరవాసులు వారాంతాల్లో ఆస్వాదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నరసింహ, అటవీశాఖాధికారులు, నాయకులు ఉన్నారు.