హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): దేశానికి అన్నం పెట్టే రైతున్న ఆపదలో ఉంటే ప్రభుత్వం ఆదుకోవాల్సిందేనని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. నీళ్లు లేక పంటలు ఎండి అల్లాడుతున్న రైతుకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ అందాల్సిందేనని స్పష్టంచేసింది. లేనిపక్షంలో తెలంగాణలో మరో ఉద్యమం మొదలైతదని హెచ్చరించింది.
అన్నదాతను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలు, కలెక్టర్లకు వినతిపత్రాల అందజేత కార్యక్రమం విజయవంతమైంది. పార్టీ శ్రేణుల్లో ఉద్యమస్ఫూర్తి తొణికిసలాడింది.
మంగళవారం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్లు, నగరపాలక సంస్థల ప్రజాప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో జిల్లా సమీకృత కలెక్టరేట్లు కిక్కిరిసిపోయాయి. తొమ్మిదిన్నరేండ్లపాటు అధికారంలో ఉన్నా ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పాత్రలో అయినా తాము ప్రజల కోసమే, ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని బీఆర్ఎస్ పార్టీ మరోసారి నిరూపించింది.
కేసీఆర్ కదిలితేగానీ..
రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులను అంచనావేయటానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనసులేదని, తమ పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగితే కానీ సాగునీటి కోసం రైతులు అల్లాడుతున్న దయనీయ పరిస్థితిని కాంగ్రెస్ సర్కారు గుర్తించలేకపోటం దారుణమని బీఆర్ఎస్ పార్టీ భగ్గుమంటున్నది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 200 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేస్తున్నది.
రైతుల దుర్భర పరిస్థితులను గ్రహించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదివారం జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటించి రైతులను ఓదార్చిన విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు దక్కాల్సిన ప్రయోజనాలను సమకూర్చాలనే ఉద్దేశంతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ధర్నా నిర్వహించి కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.
రాష్ట్రవ్యాప్తంగా రైతాంగానికి జరిగిన నష్టాన్ని అంచనావేసేందుకు అధికారుల బృందాన్ని క్షేత్రస్థాయికి పంపాలని, నష్టపోయిన ఎకరాకు రూ.25 వేల పరిహారం చెల్లించాలనే డిమాండ్తో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనగా వెళ్లి కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించాయి.
కేసీఆర్ పొలంబాట పట్టాక సర్కారు కంటితుడుపు చర్యలు: హరీశ్రావు
దొంగ పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉన్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ పొలంబాట చేపట్టాక ప్రభుత్వం కంటితుడుపు చర్యలు ప్రారంభించిందని, గాయత్రి పంప్హౌస్ నుంచి వరద కాలువకు, సాగర్ ఎడమకాల్వ నుంచి నీళ్లు విడుదల చేసిందని చెప్పారు. సిద్దిపేట కలెక్టర్ మను చౌదరికి ఆయన వినతిపత్రం అందజేశారు. మెదక్లో కలెక్టర్ రాహుల్రాజ్కు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, జడ్పీ చైర్మన్ హేమలతాశేఖర్గౌడ్, సంగారెడ్డి కలెక్టరేట్లో డీఆర్వోకు ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్రావు, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ వినతిపత్రాలు సమర్పించారు.
రైతులకు రూ.2 లక్షల పంట రుణమాఫీ చేయాలి: రవీంద్రకుమార్
ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని, రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ జిల్లా నల్లగొండ అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్టారెడ్డితో కలిసి ఆయన కలెక్టరేట్లో డీఆర్వో రాజ్యలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. సూర్యాపేట కలెక్టరేట్లో మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో రైతు బంధు సమితి మాజీ జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్ వినతిపత్రాలు అందించారు.
పరిహారం చెల్లించాల్సిందే: ఎంపీ నామా
సాగునీరు లేక ఎండిపోయిన వరి, మక్కజొన్న రైతులందరికీ పంట నష్టపరిహారం అందించాల్సిందేనని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మం కలెక్టర్కు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్తో కలిసి నామా మెమోరాండం సమర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, బానోతు హరిప్రియానాయక్, తాటి వెంకటేశ్వర్లు, దిండిగల రాజేందర్ తదితరులు పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి రైతుల సమస్యలపై కలెక్టర్ ప్రియాంక ఆలకు వినతిపత్రాన్ని అందజేశారు.
నిజామాబాద్లో వినతిపత్రాల అందజేత
కేసీఆర్ పిలుపు మేరకు పార్టీ నాయకులు నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లకు మంగళవారం వినతిపత్రాలు సమర్పించారు. మాజీ స్పీకర్ పోచారం, బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, సురేందర్ కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్కు వినతిపత్రం సమర్పించారు. బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, జడ్పీ చైర్మన్ విఠల్రావు, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్ నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంత్కు వినతిపత్రం అందజేశారు.
సర్కారు నిర్లక్ష్యంతోనే కరువు: శ్రీనివాస్గౌడ్
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో కరువు ఛాయలు నెలకొన్నాయని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. మహబూబ్నగర్ జిల్లాలో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, జోగుళాంబ గద్వాల జిల్లాలో ఎమ్మెల్యేలు బండ్ల, విజయుడు, నాగర్కర్నూల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చారు.
రైతాంగాన్ని ఆదుకోవాలి: ఎమ్మెల్యే సంజయ్
రైతాంగాన్ని ఆదుకోవాలని బీఆర్ఎస్ నాయకులు మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. పెద్దపల్లిలో కలెక్టర్ ముజామ్మిల్ఖాన్కు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, జగిత్యాలలో అదనపు కలెక్టర్ రాంబాబుకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, సిరిసిల్ల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్కు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు, మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ వినతిపత్రాలు అందించారు.
ఆపదలో ఉన్న రైతన్ననుఆదుకోవాలని వరంగల్లో వినతులు
రైతులను ఆదుకోవాలని కోరుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కలెకర్లకు వినతిప్రతాలు సమర్పించారు. మహబూబాబాద్లో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, హరిప్రియనాయక్, శంకర్నాయక్ కలెక్టర్ అద్వైత్ కుమార్సింగ్కు వినతిపత్రం అందజేశారు. వరంగల్లో కలెక్టర్ పీ ప్రావీణ్యకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, జయశంకర్ భూపాలపల్లిలో కలెక్టర్ భవేశ్మిశ్రాకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, జనగామలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాకు జడ్పీ, మున్సిపల్ చైర్పర్సన్లు గిరబోయిన భాగ్యలక్ష్మి, పోకల జమున, ములుగులో కలెక్టరేట్లో సూపరింటెండెంట్కు జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి వినతిపత్రాలు అందజేశారు.
పంట కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించండి: కోవ లక్ష్మి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఇటీవలి వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆయా జిల్లాల కలెక్టర్లకు బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రాలు అందించారు. ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షాకు, మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్కు, నిర్మల్లో ఏవోకు, కుమ్రంభీం ఆసిఫాబాద్లో ఏవో రఫత్కు వినతిపత్రాలు సమర్పించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కోవలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు తదితరులు పాల్గొన్నారు.