ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ సమరశంఖాన్ని పూరించనున్నారు. దేశంలో ప్రమాదంలో పడుతున్న ఫెడరల్, సెక్యులర్, ప్రజాస్వామిక విలువలను కాపాడాలనే తన ప్రయత్నాలకు మరింత పదును పెడుతున్నారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తున్న కేంద్రం వైఖరిని తేటతెల్లం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): బీజేపీ అప్రజాస్వామిక విధానాలను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలతో కేంద్రం అసలు స్వరూపాన్ని నగ్నంగా నడిబజారులో నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళిక రచిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలను వేదికగా చేసుకొని కలిసివచ్చే అన్నిరాష్ట్రాల విపక్ష పార్టీలతో సమన్వయం చేసుకొంటూ బీజేపీ దమననీతిపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలోని పలురాష్ట్రాల విపక్ష నేతలతో ఫోన్లో చర్చలు మొదలుపెట్టారు. శుక్రవారం పలువురు ముఖ్యమంత్రులతో మాట్లాడారు. జాతీయస్థాయి నేతలతోనూ చర్చలు కొనసాగించారు. శుక్రవారం ఉదయం నుంచి పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సన్నిహితులతో, బీహార్లో ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్తో, యూపీ ప్రతిపక్షనేత అఖిలేశ్యాదవ్తో, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా ఇతర జాతీయ విపక్ష నేతలతో సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్లో మాట్లాడారు. కేంద్రంపై చేస్తున్న ప్రజాస్వామిక పోరాటంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రతిపాదనలకు పలురాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలు సానుకూలంగా స్పందిస్తున్నారు. వరదల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మంత్రులు, అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తూనే, బీజేపీ అప్రజాస్వామిక విధానాల విపత్తు నుంచి దేశాన్ని కాపాడేందుకు పార్లమెంట్ వేదికలపై పోరాటానికి శ్రేణులను సీఎం కేసీఆర్ సిద్ధం చేస్తున్నారు.
పార్లమెంటు ఉభయసభల్లో తీవ్ర నిరసనలు
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ పిలుపు ఇవ్వనున్నారు. లోక్సభ, రాజ్యసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు ప్రస్తావించాల్సిన కీలక అంశాలు, కేంద్రాన్ని నిలదీసే అంశాలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. 18 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేసేందుకు టీఆర్ఎస్ ఎంపీలతో శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ సమావేశం అవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణకు అన్ని రంగాల్లో నష్టం చేసేలా కేంద్రం అనుసరిస్తున్న రాష్ట్ర వ్యతిరేక విధానాలను దనుమాడుతూ పార్లమెంటు ఉభయసభల్లో తీవ్ర నిరసన తెలిపి పార్లమెంటు వేదికగా పోరాడాలని ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.