BRS | హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్లో పార్లమెంట్ ఎన్నికల వేడి పతాకస్థాయికి చేరుతున్నది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకుగానూ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పార్టీలోని అన్ని స్థాయిల ఏకాభిప్రాయంతో ఖమ్మం నుంచి బీఆర్ఎస్ లోక్సభాపక్షనేత నామా నాగేశ్వరరావు, కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, మహబూబాబాద్ నుంచి ఎంపీ మాలోత్ కవిత, మహబూబ్నగర్ నుంచి ఎంపీ శ్రీనివాస్రెడ్డి, పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను అభ్యర్థులుగా కేసీఆర్ ప్రకటించారు. ఇక మిగిలిన 12 స్థానాల్లో పోటీచేసేందుకు ఆశావహులు పోటీపడుతున్నట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఎవరుంటే బాగుంటుంది? అన్న అంశంపై ఇప్పటికే రెండు, మూడు దశల్లో పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీశ్రావు, కడియం శ్రీహరి, నిరంజన్రెడ్డి, జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, తలసాని శ్రీనివాస్యాదవ్, మల్లారెడ్డి, సబితాఇంద్రారెడ్డి సహా పార్టీ పార్లమెంటరీ నేత కే కేశవరావు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అన్ని స్థాయిల పార్టీ ప్రతినిధులతో ఆరా తీశారు. ఆశావహుల జాబితా, వారి గతానుభవాలు, ప్రత్యర్థి పార్టీల ఎత్తులను చిత్తుచేయగల సమర్ధత, ఢిల్లీలో తెలంగాణ గళాన్ని బలంగా వినిపించే నాయకత్వం కోసం బీఆర్ఎస్ మునుపెన్నడూ లేనివిధంగా లోతుగా పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపి, తీరా అధికారంలోకి రాగానే పట్టపగలే చుక్కలు చూపిస్తున్నదని ప్రజలు గుర్తించారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్పై ఆశావహుల నుంచి అధిష్ఠానంపై ఒత్తిడి పెరిగిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
మారుతున్న ప్రజల మూడ్
హామీలు అమలు చేయకుండా గత ప్రభుత్వాన్ని తిట్టడానికే పరిమితం కావటంపై కాంగ్రెస్ సర్కారును ప్రజలు ఈసడించుకుంటున్నారు. గత బీఆర్ఎస్ సర్కారుపై కక్షసాధింపే తప్ప, ప్రజావసరాలు తీర్చటం లేదని మేధావి వర్గం పెదవి విరుస్తున్నది. ‘తుంటును ఎత్తేసి మొద్దును ఎత్తుకున్నట్టు ఉన్నది’ అని సదరు వర్గం విమర్శిస్తున్నది. ఎంతసేపు కేసీఆర్ను బోనులో నిలబెట్టాలనే యావ తప్ప ప్రజలకు మేలు చేయాలనే చిత్తశుద్ధి లేదని విశ్లేషిస్తున్నది. వర్షాభావ పరిస్థితులు, నీళ్లులేక ఎండిపోతున్న పంటలు, గోసపడుతున్న రైతులను చూసి చలించని సర్కారు తీరుతో రైతులు, వ్యవసాయంపై ఆధారపడిన అనుబంధ వర్గాల ‘మూడ్’ మారుతున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్తో జతకట్టేందుకు లౌకిక, ప్రజాస్వామిక శక్తులు ముందుకు వస్తున్నాయని అంటున్నారు. అందులో భాగమే బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు అని పేర్కొంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇటు పార్టీలోనూ, అటు బయట బీఆర్ఎస్పై ఒత్తిడి పెరుగుతున్నది. తమకు అవకాశం కల్పించాలని కేసీఆర్, కేటీఆర్ సహా పార్టీ ముఖ్యనేతలపై ఆశావహులు ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుత ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీమంత్రుల కుటుంబసభ్యులు, ఉద్యమకారులు, సామాజికవేత్తల నుంచి విస్తృతమైన పోటీ నెలకొన్నది. దీంతో 12 స్థానాల ఎంపికపై అధిష్ఠానం ఆచితూచి అడుగులు వేస్తున్నది.
చేవెళ్ల నుంచి..
చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి శాసనమండలి మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ, ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, మాజీమంత్రి కుమారుడు టికెట్ ఆశిస్తున్నారు. టికెట్ ఆశిస్తున్నవారిలో మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్, పటోళ్ల కార్తీక్రెడ్డి, స్వామిగౌడ్, రోహిత్రెడ్డి, నాగేందర్గౌడ్ తదితరులు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
నల్లగొండ నుంచి..
రాష్ట్రంలో ప్రస్తుతం అత్యంత కీలకమైన పదవిలో ఉన్న సీనియర్ నేత కుమారుడు తనకు నల్లగొండ లేదా భువనగిరి టికెట్ ఇస్తే పోటీకి సై అంటున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గౌడ, యాదవ, సామాజిక వర్గాలకు చెందిన నేతలు పోటీపడుతున్నారు. ఈ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్నవారిలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, కంచర్ల కృష్ణారెడ్డి, సైదిరెడ్డి, తేరా చిన్నపరెడ్డి, వేంరెడ్డి నర్సింహారెడ్డి, గుత్తా అమిత్రెడ్డి, కడారి అంజయ్యయాదవ్ తదితరులు పోటీపడుతున్నట్టు తెలుస్తున్నది.
సికింద్రాబాద్ నుంచి..
సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్నవారిలో తలసాని సాయికిరణ్ యాదవ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డి, పార్టీ హైదారాబాద్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి, పార్టీ నేతలు వెంకట్రెడ్డి, ఎడ్ల సుధాకర్రెడ్డి తదితరులు పోటీపడుతున్నట్టు తెలిసింది.
జహీరాబాద్ నుంచి..
ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్లకు చైర్మన్లుగా వ్యవహరించిన యువ నాయకులు (ఒక ముస్లిం, ఒక బీసీ సామాజికవర్గానికి వర్గానికి చెందిన వారు) డీసీఎంఎస్ చైర్మన్గా వ్యవహరించిన నాయకుడు, ఒక పారిశ్రామికవేత్త, విద్యావేత్త పోటీపడుతున్నారు. ఈ స్థానం నుంచి గాలి అనిల్కుమార్, మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి, మహమ్మద్ తన్వీర్, మంజరి జైపాల్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, పార్టీ నేత తిరుమల్రెడ్డి టికెట్ ఆశిస్తున్నవారిలో ఉన్నట్టు సమాచారం.
వరంగల్ నుంచి..
వరంగల్ లోక్సభ నుంచి జనరల్ స్థానాలకు భారీ పోటీ ఉన్నట్టు ఆశావహుల జాబితా చూస్తే స్పష్టం అవుతున్నది. సిట్టింగ్ ఎంపీ, గతంలో రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించిన మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక జడ్పీ చైర్మన్గా వ్యవహరిస్తున్న నేత, మాజీ ఉపముఖ్యమంత్రి కుమార్తె, విద్యార్థి నాయకులుగా, ఉద్యమకారులుగా గుర్తింపు ఉన్న ముగ్గురు మాజీ కార్పొరేటర్లతోపాటు, పలువురు విద్యార్థి నాయకులు వరంగల్ టికెట్ ఆశిస్తున్నారు. వీరిలో సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు డాక్టర్ కడియం కావ్య, హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, బీఆర్ఎస్వీ నేత ప్రభాకర్ టికెట్ కోసం పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.
భువనగిరి నుంచి..
భువనగిరి లోక్సభ స్థానం కోసం తెలంగాణ మలిదశ ఉద్యమకారులు, తెలంగాణ రుచులను ఉద్యమరూపాలుగా మలిచినవారు, విద్యార్థి, పాత్రికేయులు, సామాజిక ఉద్యమా ల్లో భాగస్వాములైనవారు, ఉమ్మడి రాష్ట్రంలోనే కా కుండా స్వరాష్ట్రంలోనూ కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్లో కీలకమైన బాధ్యతలు నిర్వర్తించిన నాయకుల నుంచి ఒత్తిడి వస్తున్నది. భువనగిరి నుంచి గుత్తా అమిత్రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి, భిక్షమయ్యగౌడ్, చెరుకు సుధాకర్, బాలరాజుయాదవ్, పల్లె రవికుమార్గౌడ్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పోటీపడుతున్నట్టు సమాచారం.
మల్కాజిగిరి నుంచి..
ప్రస్తుత ఎమ్మెల్సీతోపాటు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, విద్యాసంస్థల నిర్వాహకుడు, మాజీ మంత్రి తనయుడు, అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కీలకనేతతోపాటు, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు, బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చురుకైన నాయకుడిగా, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ టికెట్ ఆశిస్తున్నవారిలో ఉన్నారని తెలిసింది. వీరితోపాటు ఇద్దరు విద్యావేత్తలు, ఒక పారిశ్రామికవేత్త అవకాశం అడుగుతున్నట్టు సమాచారం. విశ్వసనీయవర్గాల సమాచారం బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్నవారిలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్, నందికంటి శ్రీధర్, మన్నె క్రిశాంక్, చామకూర భద్రారెడ్డి తదితరులున్నట్టు సమాచారం.