KCR | హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): త్వరగా కోలుకొని ప్రజల ముందుకు వస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. అప్పటిదాకా సంయమనం పాటించి తనను చూసేందుకు ఎవరూ దవాఖానకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడలోని యశోద దవాఖానలో చికిత్సపొందుతున్న కేసీఆర్ను చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది తరలివస్తున్నారు. ఆరు రోజులనుంచి దవాఖాన ప్రాంగణం కేసీఆర్ అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, సాధారణ ప్రజలతో కిక్కిరిసిపోతున్నది.
దవాఖాన బయట, లోపల ఇబ్బందికర వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మంగళవారం దవాఖాన వర్గాలు కేసీఆర్తో ఓ ప్రకటన విడుదల చేయించాయి. వీడియో సారాంశం కేసీఆర్ మాటల్లోనే.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాదిగా.. వేలాదిగా తరలివచ్చిన అభిమానులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నాకు అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్తో యశోద హాస్పిటల్లో ఉన్న. ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటది. దాంతో సమస్య ఇంకా పెరిగి చాలా అవస్థలు వస్తయి.
నెలల తరబడి హాస్పిటల్లో ఉండాల్సి వస్తదని వైద్యబృందం నన్ను హెచ్చరించింది. అందువల్ల మీ అభిమానానికి చేతులెత్తి దండంపెడుతున్న. మీరందరూ బాధపడకుండా మీమీ స్వస్థలాలకు క్షేమంగా వెనుతిరిగి పోవాలె. రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.. కనీసం ఇంకో 10 రోజుల వరకు ఎవరూ కూడా తరలిరావద్దని.. అందరికిగూడ మంచిది కాదని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. ట్రాఫిక్ వాళ్లకు కూడా ఇబ్బందులున్నాయి.
హాస్పిటల్లో మనంకాకుండా వేరే వందలాది మంది పేషెంట్లు కూడా ఉన్నరు. వాళ్ల క్షేమం కూడా మనకు అంతే ముఖ్యం. మీరు అన్యదా భావించకుండా క్రమశిక్షణతో క్షేమంగా మీమీ ఇండ్లకు చేరండి. నేను కోలుకున్న తర్వాత రోజూ ప్రజల మధ్యనే ఉండేవాడినే కాబట్టి మనం కలుసుకుందాం. ఇబ్బంది లేదు. నా కోరిక మన్నించి హాస్పిటల్ దగ్గర.. హాస్పిటల్ లోపల పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మీరు వెంటనే తరలివెళ్లాలి. మీరు క్షేమంగా ఇండ్లకు చేరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. నా మాటను మన్నించి, గౌరవించి ఏమాత్రం ఇబ్బంది లేకుండా గొడవ లేకుండా మీరందరూ స్వస్థలాలకు వెళ్లాలని.. నా విజ్ఞప్తిని మీరు తప్పకుండా మన్నించి గౌరవిస్తారని భావిస్తున్నా.. ధన్యవాదాలు.