Minister Talasani Srinivas | దేశానికే వెన్నెముక అయిన రైతును రాజు చేయాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రైతు దినోత్సవం సందర్భంగా బోయిన్పల్లి మార్కెట్ యార్డులో రైతులతో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న సంతోషంగా ఉండాలని, గౌరవించుకోవాలనే ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను రూపకల్పన చేసి అమలు చేస్తుందని వివరించారు. 2014 సంవత్సరానికి ముందు రైతులు అనేక సమస్యలతో సతమతం అయ్యేవారని, పంటలు సరిగా పండక, గిట్టుబాటు ధరలు లభించేది కాదన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి, రైతులు సంతోషంగా ఉండాలనే ఆలోచనతో అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని చెప్పారు. ప్రధానంగా వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ సరఫరా, నూతన ప్రాజెక్టులను నిర్మించి సాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. పంట పెట్టుబడుల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎకరానికి రూ.10వేల ఆర్థిక సహాయం అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంలో దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం జరిగిందని చెప్పారు.
స్వయం పాలన వచ్చిన తర్వాత సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించడం జరిగిందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా, గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నా గత పాలకులు పట్టించుకోలేదని, సీఎం ఆ నీటిని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో నూతన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ సరఫరా కోసం ప్రభుత్వం సంవత్సరానికి రూ.12వేల కోట్లను భరిస్తుందని, పంట పెట్టుబడి సాయం కోసం రూ.15వేలకోట్ల వెచ్చిస్తుందని అన్నారు. గతంలో వ్యవసాయానికి విద్యుత్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండి రైతులు ఎన్నో ఇబ్బందులు పడిన విషయాన్ని గుర్తుచేశారు.
రైతులకు తీవ్రంగా నష్టం కల్పించే నకిలీ విత్తనాలను అరికట్టడానికి పీడీయాక్ట్ను తీసుకొచ్చినట్లు చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలతో రాష్ట్రంలో సాగుభూమి విస్తీర్ణం పెరిగి పంటల దిగుబడి కూడా గణనీయంగా పెరిగి దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ అభివృద్ధి చెందిందని చెప్పారు. నాడు 68లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే నేడు.. 2.70కోట్ల టన్నులకు చేరుకుతుంది. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనతో రైతు బీమా కింద రూ.5లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న పలువురు రైతులను మంత్రి రాష్ట్రం ఆవిర్భావానికి ముందు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తెలుసుకున్నారు. పలువురు రైతులు, హమాలీలను సన్మానించారు.