హైదరాబాద్ : వ్యవసాయరంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకువచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. ఈ యాసంగి సీజన్లో ధాన్యాన్ని ప్రభుత్వమే సేకరిస్తుందని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘సమైక్య రాష్ట్రంలో అత్యంత బాధాకరంగా నలిగిపోయి, చితికిపోయిన రంగం వ్యవసాయరంగం. పూర్తిస్థాయిలో మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ ధ్వంసం చేయబడి, ప్రాజెక్టులు అనేక సంవత్సరాలు పెండింగ్ పెట్టారు. తెలంగాణ రైతాంగానికి అప్పుడు భూగర్భ జలాలే దిక్కైనయ్. కరువు, కాటకాటలు అనేక ఇతర్ర కారణాలతో తెలంగాణ గ్రామీణ ముఖచిత్రం మొత్తం చెల్లాచెదురైపోయి రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు భయంకరంగా జరిగాయి.
అనేక దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో.. తెలంగాణ గ్రామీణ ఆర్థిక పరిపుష్టి కోసం చాలా పకడ్బందీ ప్రణాళికతో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంది. అందులో భాగంగా వ్యవసాయరంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించే దిశగా అనేక ఉద్దీపనలు సమకూర్చడం జరిగింది. అందులో ఒక భాగం నీళ్ల సమస్య, ప్రాజెక్టులు కాకపోవడం, కాలువల ద్వారా నీళ్లు రాకపోవడం. రెండోభాగం ఉన్న కొద్దిపాటి 600 భూగర్భ జలాలు బోర్ల ద్వారా తీసుకునేందుకు అవసరమైన కరెంటు లేక చాలా వ్యవస్థ ఉండి.. వందల సంఖ్యలో రోజు మోటార్లు కాలిపోయి రైతులు నష్టపోయారు. ఇలా చాలా బాధకరమైన విషయాలు చూశాం. దానికి పునర్జీవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం మిషన్ కాకతీయ తీసుకువచ్చింది. కార్యక్రమం అద్భుతమైన ఫలితాలు ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర జనవరుల శాఖ నివేదికలో వెల్లడించింది. దేశంలో అత్యధికంగా భూగర్భ జలాలు పెంచిన రాష్ట్రం ఏదంటే తెలంగాణ అని చెప్పింది. దానికి తోడుగా ఎలక్ట్రిసిటీని చాలా అద్భుతంగా చేసి, నాణ్యమైన విద్యుత్ను 24 గంటలు అన్ని రంగాలకు అందించాం.
రాబోయే రోజుల్లో యాదాద్రిలో 4వేల మెగావాట్లు, ఎన్టీపీసీ 1600 మెగావాట్లు, మరో 500మెగావాట్ల థర్మల్ విద్యుత్ 2023లో అందుబాటులోకి రాబోతున్నది. విద్యుత్ పంపిణీ విధానంలో ఉన్న అసమతుల విధానాన్ని సమతులం చేసి, కోతలు, లోవోల్టేజీ లేకుండా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయడంతో గణనీయంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. ప్రపంచమే అబ్బురపడేలా మిషన్ కాకతీయ పూర్తి చేశాం. యూఎన్వో సైతం ప్రశంసించింది. రీ ఇంజినీరింగ్ చేసి భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం. ప్రపంచంలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కాళేశ్వరం రికార్డు సమయంలో కంప్లీట్ చేయడంతో దానికి ఫలితాలు అందుతున్నాయి. దీనికి తోడు మూడు నాలుగు సంవత్సరాలు భగవంతుడి దయతో ప్రకృతి కరుణించడంతో వర్షాపాతం తోడైంది. దానికి తోడుగా కరెంటు అద్భుతంగా అన్ని సీజన్లలో ఏమాత్రం సమస్యలు లేకుండా సరఫరా కావడం ఇన్ఫుట్ అయ్యింది. వీటికి తోడు ప్రభుత్వం ఇచ్చిన ఉద్దీపనలు ఇండియాలో కాదు ప్రపంచంలో ఇవ్వరు.
ప్రపంచంలో, భారత్లోనే కాదు భూగోళంలో ఎక్కడా లేని విధంగా ఎక్కడా సంవత్సరానికి పది వేలు ఇస్తున్నాం. మధ్యలో దళారులు లేకుండా నేరుగా రైతులకు ఇస్తున్నాం. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ నీటిని సరఫరా చేయడం, గతంలో ఉన్న రూ.500కోట్ల నీటి తీరువా బకాయిలు రద్దు చేయడంతో పాటు కొత్తగా ఎక్కడా రూపాయి తీసుకోకుండా నీటిని సరఫరా చేస్తున్నాం. ఇలా పొరుగు రాష్ట్రాలతో ప్రధాని మోదీ రాష్ట్రం గుజరాత్లో ఇవ్వడం లేదు. సర్ఫేస్ వాటర్ను వితౌట్ సెస్ సరఫరా చేస్తున్నాం. రైతులు చనిపోతే కారణంతో నిమిత్తం లేకుండా రైతుబీమా కల్పించాం. వీటితో రైతులు అద్భుతంగా పంటలు పండించారు. కరోనా సందర్భంలో చెలరేగిన మరణాలు, భయోత్పాతంతో ఒకే చోటకు రైతులంతా వచ్చి మార్కెట్లలో ఉంటే వైరస్ ప్రబలుతుందని.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 7వేలకుపైగా కొనుగోలు కేంద్రాలు చేశాం. ధాన్యం కొనుగోలు చేసి, మూడు నాలుగు రోజుల్లోనే రైతుల అకౌంట్లలో రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు జమ చేసింది. దీంతో చాలా సానుకూలమైన పవనం వీచింది. పంటలు పండడం కోసం ఇచ్చే డబ్బులు, కరెంటు, నీళ్లు, ఇతర ప్రోత్సాహకాలు, కల్తీ లేని విత్తనాలు, ఎక్కడికక్కడ కొనుగోళ్లతో రైతులు అద్భుతంగా ధాన్యం పండిస్తున్నది. రెండు పంటల్లో కోటిపైచీలుకుపైగా ఎకరాల్లో విస్తీర్ణం పెరిగి.. పంటలు బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి’ అని సీఎం కేసీఆర్ అన్నారు.