KCR | హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై బీజేపీ మరో కుట్రకు సిద్ధమైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. ఓట్ల కోసం తెలంగాణ నీళ్లను ఇతర రాష్ర్టాలకు మళ్లించుకోవాలని కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం తెలంగాణ భవన్లో పార్టీ లోక్సభ అభ్యర్థులు, నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు, ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణకు దకాల్సిన గోదావరి జలాలను ఇతర రాష్ట్రాలకు మళ్లించాలని కేంద్రం కుట్రలు చేస్తున్నది. గోదావరినది మీద ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్ట్ కట్టి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు నీళ్లను మళ్లించుకుపోదామని చూస్తున్నది. ఇది బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు వ్యతిరేకం. నదీ జలాల పంపిణీపై 1974లో బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు అందరికీ శిరోధార్యం. నదీ జలాలను బేసిన్ల వారీగా పంచి ఎగువ రాష్ట్రాల నుంచి దిగువ రాష్ట్రాలకు నీటి పంపకం చేసింది.
ఎగువ రాష్ట్రాలకు కేటాయించిన నీళ్లు పోను చివరకు మిగిలిన నీరు అంతా దిగువ రాష్ట్రమైన మన రాష్ట్రానికి దకాలని తీర్పు స్పష్టంగా చెప్పింది. గత 50 ఏండ్ల నుంచి బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారమే నీటి పంపకాలు జరుగుతున్నప్పటికీ, కొత్తగా ఇప్పుడు కర్ణాటక, తమిళనాడులో ఓట్లు దండుకోవడానికి నీళ్లు మళ్లించి, తెలంగాణ ప్రజల నోట్లో మట్టికొట్టే కుట్రలకు బీజేపీ సిద్ధమైంది.
ఇంత జరుగుతున్నా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తున్నది? ట్రిబ్యునల్ తీర్పుకు వ్యతిరేకంగా కేంద్రం ముందుకు పోతుంటే అడ్డుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇది రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతా? కాదా? తెలంగాణ నదీ జలాలు కాపాడాలంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం.
బీఆర్ఎస్ ఎంపీలు, పార్టీ శ్రేణులు పేగులు తెగేదాకా కొట్లాడైనా తెలంగాణకు చెందాల్సిన నదీ జలాలను కాపాడుకుంటాం. ఇవన్నీ ఆలోచించి ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను భారీ మెజార్టీతో గెలిపించాలి. తెలంగాణ ప్రజలకు బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న నష్టం గురించి వివరించాలి. కాంగ్రెస్ పార్టీకి నదులు, నీళ్లు గురించి తెలియదు. వాటి ప్రాధాన్యత కూడా వారికి అర్థం కాదు.
గోదావరి, కృష్ణా నదులు, కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ గురించి వారికి అర్థంకాదు. గోదావరిని శాశ్వతంగా ఆంధ్ర, ఇతర రాష్ర్టాలకు అప్పగించే కుట్ర చేస్తున్నారు. దీనిపై మనం పోరాడాలి. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించాలి’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.