సర్వేలో పాల్గొన్న వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు
పర్యవేక్షించిన ఎంపీడీవోలు
యాదాద్రి, మే 6 : కరోనా కట్టడికి సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇంటింటికీ వెళ్లి ప్రతి కుటుంబ సభ్యుడికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సంకల్పించిన నేపథ్యంలో యాదగిరిగుట్ట పట్టణంలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ స్క్రీనింగ్ సర్వే నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇంట్లో ఎవరైనా కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారా అనే వివరాలు తెలుసుకుని నమోదు చేసుకున్నారు. లక్షణాలు ఉన్నవారికి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యాదగిరిపల్లి అంగన్వాడీ టీచర్ పాండవుల కల్పన, ఏఎన్ఎం సుధారాణి, ఆశ స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్లో…
భువనగిరి అర్బన్, మే 6: కరోనా కట్టడికి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని ఎంపీడీవో నాగిరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని అనంతారం, తాజ్పూర్, హన్మాపురం గ్రామాల్లో వైద్య సిబ్బంది నిర్వహించిన ఇంటింటి సర్వేను ఎంపీడీవో పరిశీలించారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వెంటనే వైద్యుల సలహాలు, సూచనలు చేయడంతోపాటు ఇతర జబ్బులతో బాధపడుతున్న వారిని గుర్తించి సంబంధించిన కిట్లను అందజేయడం జరుగుతుందన్నారు. కరోనా బారినపడితే వారికి వెంటనే చికిత్స అందిస్తామన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట రూరల్లో…
యాదగిరిగుట్ట రూరల్, మే 6 జ్వరం, ఇతర లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఏఎన్ఎం, ఆశ, అంగన్వాడీ వర్కర్, పంచాయతీ అధికారులు మండలంలోని అన్ని గ్రామాల్లో సర్వే చేపట్టారు. సైదాపురం, మాసాయిపేట, గౌరాయపల్లి గ్రామాల్లో జరుగుతున్న సర్వేను ఎంపీడీవో కారం ప్రభాకర్రెడ్డి పరిశీలించి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
మోటకొండూర్లో…
మోటకొండూర్, మే 6: ప్రభుత్వం చేపట్టిన కొవిడ్-19 ఇంటింటి సర్వేకు ప్రజలు సహకరించాలని మండల వైద్యాధికారి రాజేందర్నాయక్, ఎంపీడీవో వీరస్వామి కోరారు. గురువారం మండలంలోని గ్రామాల్లో మండల వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో కొవిడ్-19 ఇంటింటి సర్వేను చేపట్టారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి మాట్లాడుతూ.. కరోనాను అరికట్టేందుకే ప్రభుత్వం సర్వేను చేపట్టిందన్నారు. కార్యక్రమంలో మండల వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
బొమ్మలరామారంలో…
బొమ్మలరామారం, మే 6: ప్రభుత్వం కరోనా కట్టడికి గ్రామాల్లో చేపట్టిన ఇంటింటి జ్వరం సర్వేకు ప్రజలు సహకరించాలని నాగినేనిపల్లి సర్పంచ్ భట్కీర్ బీరప్ప అన్నారు. మండలంలోని నాగినేనిపల్లి, ఫకీర్గూడ, రామలింగంపల్లి తదితర గ్రామాల్లో మండల వైద్య బృందాలు ఇంటింటా జ్వర సర్వేను నిర్వహించారు. బృందాలు ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మెడబొయిన గణేశ్, ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఆలేరురూరల్లో…
ఆలేరురూరల్, మే 6 : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ఇంటింటా జ్వర సర్వే చేపట్టగా మండలంలోని అన్ని గ్రామాల్లో సర్వే బృందాలు ఇంటింటికి వెళ్లి జ్వరం, దగ్గు, కరోనా లక్షణాలు ఉంటే వారి పేర్లు నమోదు చేసుకుంటున్నారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఆశకార్యకర్తలు ఉన్నారు.
తుర్కపల్లిలో…
తుర్కపల్లి, మే 6 : ప్రభుత్వ ఆదేశానుసారం మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో వైద్య సిబ్బంది ఆశవర్కర్లు, అంగన్వాడీలు ఇంటింటా ఆరోగ్య సర్వే నిర్వహించారు. గ్రామాల్లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇంటింటా ఆరోగ్య సర్వే చేపట్టింది. వాసాలమర్రిలో చేపట్టిన సర్వేను ఎంపీవో శ్రీమాలిని పరిశీలించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశవర్కర్లు, అంగన్వాడీలు పాల్గొన్నారు.
రామన్నపేటలో…
రామన్నపేట, మే 6 : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల వ్యాప్తంగా వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. గురువారం వైద్య సిబ్బంది గ్రామాల్లో ఇండ్లకు వెళ్లి కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. జ్వరం, దగ్గు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి మందులను అందజేశారు. కరోనా లక్షణాలు కనిపించిన వారిని గుర్తించి మెడికల్ కిట్లను అందజేశారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి రవికుమార్, ఆరోగ్య బోధకుడు సత్యనారయణ, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
బీబీనగర్లో…
బీబీనగర్, మే 6 : గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి తొలి దశలోనే కరోనా అనుమానితులను గుర్తించడం ద్వారా కరోనా కట్టడి సాధ్యమవుతుందని ఎంపీడీవో శ్రీవాణి అన్నారు. గురువారం మండలంలోని కొండమడుగు, మహదేవ్పూర్ గ్రామాల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటి సర్వేను ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి కొవిడ్పై అప్రమత్తంగా ఉండేలా వైద్య సిబ్బంది పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యులు ప్రవీణ్కుమార్, సర్పంచ్లు, గ్రామ కార్యదర్శులు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
వలిగొండలో…
వలిగొండ, మే 6 : కరోనా నియంత్రణకు ఇంటింటి సర్వేను కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో గురువారం చేపట్టామని ఎంపీడీవో గీతారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో 40 బృందాలతో ఇంటింటి సర్వే నిర్వహించామని, వైద్య సిబ్బందితోపాటు అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు సర్వేలో పాల్గొంటున్నారని, మొదటి రోజు 3,545 కుటుంబాలను సర్వే చేయగా, 125 మంది అనారోగ్య లక్షణాలతో ఉన్నారని, అనారోగ్యంతో ఉన్న 41మందికి కరోనా మెడికల్ కిట్లను, 81 మందికి మందులు అందజేశారని తెలిపారు.
ఆత్మకూరు(ఎం)లో…
ఆత్మకూరు(ఎం), మే 6 : జ్వరం, జలుబుతోపాటు కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టి పేర్లు నమోదు చేసుకున్నారు. గ్రామాల్లో చేపట్టిన సర్వేను మండల ప్రత్యేకాధికారి శ్యామ్సుందర్, ఎంపీడీవో రాములు, మండల వైద్యాధికారి ప్రణీష పరిశీలించారు.
మోత్కూరులో…
మోత్కూరు, మే 6: మోత్కూరు పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్యాధికారులు ఇంటింటా సర్వేను నిర్వహించారు. గురువారం మండలంలోని దత్తప్పగూడెం గ్రామంలో వైద్యాధికారి డాక్టర్ చైతన్యకుమార్ ఇంటింటా సర్వేలో పాల్గొన్నారు. ప్రజలు కరోనా రుగ్మతలు ఉంటే భయపడకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
అడ్డగూడూరులో…
అడ్డగూడూరు, మే 6 : కరోనా కట్టడికి ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య బృందాలు ఇంటింటా జ్వర సర్వే చేస్తున్నాయని ఎంపీడీవో చంద్రమౌళి అన్నారు. మండలంలోని చౌళ్లరామారం గ్రామంలో గురువారం ఇంటింటా జ్వర సర్వే నిర్వహించారు. జ్వరం, జలుబు, దగ్గు ఎక్కువగా ఉన్నవారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శి వెంకటేశం, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.