హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సమైక్యతా ఉద్యమంలో కానీ, తెలంగాణ సాధన ఉద్యమంలో కానీ బీజేపీ పాత్ర ఏమిటని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిలదీశారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతోపాటు బీజేపీ నాయకులపై ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో, హైదరాబాద్ సమైక్యత ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏమిటి? అని ఆమె ట్విట్టర్లో ప్రశ్నించారు. అమిత్షాతోపాటు రాష్ట్ర బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బిడ్డగా బీజేపీ చెప్పే సమాధానాల కోసం తాను ఎదురుచూస్తుంటానని పేర్కొన్నారు. రాష్ర్టాలకు వచ్చి హామీలు ఇవ్వడం, ప్రజలను వంచించడం బీజేపీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. దేశంలో ప్రజలకు హకులు కల్పించడానికి బీజేపి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. సామరస్యం, ఏకత్వం, ప్రజాబలం ఇవే సీఎం కేసీఆర్కు, తెలంగాణకు పునాది అని తెలిపారు.
రాచరికం నుంచి ప్రజాస్వామ్యం వైపు
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలన వైపు అడుగులేసిన తెలంగాణ సమైక్యతా దినోత్సవం జరుపుకొంటున్నదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తూ దేశంలోనే నంబర్ వన్గా మారిందని ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ విశాల దృక్పథం వల్లనే సమైక్యతా ఉత్సవాల నిర్వహణ సాధ్యమైందని పేర్కొన్నారు.