కరీంనగర్/హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ ) : ‘నువ్వు ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నవో చెప్పు.. పార్టీ మారిన నీకు మాట్లాడేహక్కు లేదు.. రాజీనామా చేసే దమ్ముందా?’ అంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి.. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ను నిలదీశారు. ఆదివారం నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం వాడివేడిగా జరిగింది. జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఉమ్మడి జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు సమక్షంలో జగిత్యాల ఎమ్మెల్యేను కౌశిక్రెడ్డి పలు ప్రశ్నలతో నిలదీశారు. ‘నువ్వు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన స్వార్థపరుడివి. నీకు ఇక్కడ మాట్లాడే అర్హత లేదు. ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నవో చెప్పాలి? అని ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఒకరినొకరు నెట్టుకుంటూ దూషించుకున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీహెచ్ విజయరమణారావు, ఆది శ్రీనివాస్, డాక్డర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, అడ్లూరి లక్ష్మణ్కుమార్, మక్కాన్సింగ్ ఠాకూర్ తదితరులు కౌశిక్రెడ్డిని అడ్డుకున్నారు. ఆయనను వేదికపై నుంచి కిందికి నెట్టే ప్రయత్నం చేశారు. దీంతో వేదికపైనే ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకుని కౌశిక్రెడ్డిని బలవంతంగా కలెక్టరేట్ ఆడిటోరియం నుంచి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో కౌశిక్రెడ్డి తుల్లి వేదికపై ఉన్న కుర్చీలో పడిపోయారు. పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లి ఆడిటోరియం బయట వదిలేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, కౌశిక్రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే సంజయ్.. పాడి కౌశిక్రెడ్డి ఛాతీపై చేయి వేసి నెట్టేశారు.
ప్రభుత్వం కొత్తగా అమలుచేస్తున్న నాలుగు పథకాల గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్రెడ్డి మంత్రులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఉపాధిహామీ పథకంలో 20 రోజులు పనులు చేసి ఉంటేనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తిస్తుందనే నిబంధన వల్ల అర్హులకు అన్యాయం జరుగుతుందని, ఆ నిబంధనను తొలగించాలని సూచించారు. పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. తన నియోజకవర్గానికి రూ.10 కోట్లు ఇచ్చారని, కానీ, కాంగ్రెస్ ఇన్చార్జి పేరిట జీవో ఇచ్చారని, ఇదేం పాలన? అని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని గత ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా అమలుచేసిందని, వేలాదిమందికి తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన డబ్బులు వారి ఖాతాల్లోనే ఉన్నాయని, వాటిని విడిపించుకునే అవకాశం ఇవ్వాలని అడిగితే దళితులపై కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ.. జగిత్యాల పరిధిలోని నూకపల్లి అర్బన్ హౌసింగ్ సొసైటీ గురించి ప్రశ్నించారు. కరీంనగర్ మేయర్ సునీల్రావు మాట్లాడుతూ.. జిల్లాలో ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారో చెప్పాలని కోరారు.
చివరి లబ్ధిదారుని వరకు ప్రభుత్వ ప్రయోజనాలు అందాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు. వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా ఇస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్కార్డు అందిస్తామని తెలిపారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. ప్రభు త్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు చేరవేస్తున్నందుకు అధికారులను అభినందించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను అధికారులు సక్రమంగా అమలుచేయాలని, నిజమైన లబ్ధిదారులకు అందేలా చూడాలని కోరారు. సమావేశంలో ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
కేసీఆర్ పెట్టిన భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్కు దమ్ముంటే రాజీనామా చేసి, కాంగ్రెస్ బీఫాంపై పోటీ చేసి గెలవాలని పాడి కౌశిక్రెడ్డి సవాలు చేశారు. తనపై కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యం చేస్తున్నదని మండిపడ్డారు. ఆదివారం ఆయన హైదరాబాద్లో తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేనైన తనను మంత్రుల సాక్షిగా కరీంనగర్ సమీక్షా సమావేశం నుంచి బయటకు లాక్కొచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి, అమ్ముడుపోయిన జగిత్యాల ఎమ్మెల్యేను ‘నీది ఏ పార్టీ?’అని అడిగితే.. ‘కాంగ్రెస్ పార్టీ’ అని చెప్తున్నాడని, అతనిపై స్పీకర్ అనర్హత వేటు వేయాలని కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ను విమర్శిస్తుంటే తాము చూస్తూ ఊరుకోలేమని స్పష్టంచేశారు.
ఇలాంటి వారిని నిలదీస్తామని, అడుగడుగునా అడ్డుకుంటామని చెప్పారు. మూడేండ్ల తర్వాత మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని, ఇప్పుడు అతిగా ప్రవర్తిస్తున్న ప్రతి ఒక్కరిపై చర్యలు తప్పవని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిన ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. సంజయ్ రాజీనామా చేసే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని స్పష్టంచేశారు. ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ.. కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే మంత్రి, కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పకుండా దాడులు చేశారని ఆరోపించారు. రైతుల గురించి అడిగితే సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారని విమర్శించారు.