హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 53 శాతం ఎస్సీ, ఎసీ వర్గాలకు చెందిన అమ్మాయిలే చదువుకొంటున్నారు. దేశవ్యాప్తంగా సామాజికవర్గాల వారీగా వివరాలను పరిశీలిస్తే… వీరిలో 27% ఎస్సీ బాలికలుండగా, ఎస్టీలు 26% విద్యనభ్యసిస్తున్నారు. ఇక ఓబీసీలు 35శాతం కాగా, ముస్లింలు 3 శాతం మాత్రమే కేజీబీవీల్లో చదువుకొంటున్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో నాణ్యమైన విద్య అందించేందుకు జాతీయంగా కేజీబీవీలను నిర్వహిస్తున్నారు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పూర్తిగా రెసిడెన్షియల్ పద్ధతిలో నడుపుతున్నారు. జాతీయంగా 8,06,528 మంది విద్యార్థినులకు విద్యనందించడం లక్ష్యంగా కేంద్రం 5,646 కేజీబీవీలను మంజూరు చేసింది. ప్రస్తుతం 4,988 కేజీబీవీలు నడుస్తున్నాయి. 6,69,070 మంది విద్యార్థినులు చదువుకొంటున్నారు.
తెలంగాణలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్నది. రాష్ట్రంలో 52 శాతం ఓబీసీ వర్గాలకు చెందిన అమ్మాయిలు కేజీబీవీల్లో చదువుకొంటున్నారు. 44శాతం ఎస్సీ, ఎస్టీల అమ్మాయిలున్నారు. మైనార్టీలు అతి తక్కువగా 0.57 మాత్రమే కేజీబీవీల్లో నమోదయ్యారు. రాష్ట్రంలో 204 మైనార్టీ గురుకులాలుండగా, వీటిల్లో ప్రత్యేకించి 97 గురుకులాలు అమ్మాయిల కోసమే నిర్వహిస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొన్నది. రాష్ట్రంలో మొత్తం 495 కేజీబీవీలున్నాయి. వీటిల్లో 1,40,470 మంది విద్యార్థులు చదువుకొంటున్నారు.
తెలంగాణలోని నమోదును జాతీయంగా పోల్చితే దాదాపు 20 శాతం మనదగ్గరే ఉండటం విశేషం. రాష్ట్రంలో 2022 -23లో 1,33,166 విద్యార్థులుండగా, ఈ విద్యాసంవత్సరంలో 1,40,470కి పెరిగింది. రాష్ట్రంలోని 245 కేజీబీవీలను ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్చేసి ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ వంటి కోర్సులను నిర్వహిస్తున్నారు. గత విద్యాసంవత్సరం నుంచి అన్ని కేజీబీవీల్లో ఇంగ్లిష్ మీడియం విద్యాబోధన చేపట్టారు. ఫలితంగా కేజీబీవీలు విజయపథంలో సాగుతున్నాయి.