బచ్చన్నపేట, జూలై 23 : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటలోని వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలించొద్దని గురువారం గ్రామస్తులు, రైతులు ఆందోళనకు దిగారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకొని వెనక్కి పంపించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. గ్రామం నుంచి ఇసుక తరలింపునకు అనుమతులు నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతున్నదని, అందరం ఐక్యంగా ముందుకొస్తేనే ఇసుక అక్రమరవాణాకు బ్రేక్ వేయవచ్చని సూచించారు. ఈ విషయమై సర్పంచ్ ఫిరోజ్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేక తీర్మానం చేయాలని కోరారు. ఆందోళనలో మాజీ సర్పంచ్ మామిడి మల్లయ్య, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.