గుమ్మడిదల, జూలై 23 : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారంలో ప్రతిపాదిత టీజీఐఐసీ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రాజెక్ట్ కోసం అవసరమైన 66 ఎకరాల భూసేకరణకుగాను జిల్లా కలెక్టర్ కార్యాలయం ఇటీవల ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేసింది. భూసేకరణ చట్టం-2013 సెక్షన్ 11(1) ప్రకారం భూసేకరణ చేపట్టనున్నట్టు ఓ ప్రధాన ప్రతికలో జూన్ 18న ప్రకటన విడుదల చేసింది. ఈ విషయం ఇంకా మండల ప్రజలకు, అన్నారం రైతులకు తెలియకపోవడం గమనార్హం. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ ప్రాజెక్టుకు సామాజిక ప్రభావ మదింపు ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ జారీ చేసిన జీవోఆర్టీ నంబర్ 44, తేదీ 13.03.2026 ప్రకారం ఈ నిర్ణయం తీసుకోగా, తెలంగాణ గెజిట్ మార్చి 16న ప్రచురితమైంది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం భూ సేకరణకు సంబంధించిన పూర్తి వివరాలు, మ్యాపులు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం, రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయాల్లో కార్యాలయ వేళలో పరిశీలించేందుకు, భూ సేకరణ ప్రక్రియను నిర్వహించేందుకు రెవెన్యూ డివిజన్ అధికారికి ప్రభుత్వం అధికారాలు అప్పగించింది. నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి జిల్లా కలెక్టర్ ముందస్తు అనుమతి లేకుండా సంబంధిత భూముల అమ్మకం, కొనుగోలు, బదిలీ లేదా ఇతర హక్కుల బదలాయింపులు చేపట్టరాదని స్పష్టం చేశారు. భూసేకరణపై అభ్యంతరాలు ఉన్న భూ యజమానులు, హక్కుదారులు లేదా ఇతర ప్రయోజనదారులు నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 60 రోజుల్లోపు జిల్లా కలెక్టర్ లేదా భూసేకరణ అధికారికి లిఖితపూర్వకంగా సమర్పించాలని పేర్కొన్నారు.
అన్నారంలోని 261 సర్వే నంబర్లోని 66 ఎకరాల భూములను టీజీఐఐసీకి అప్పగించేది లేదంటూ మార్చి 10వ తేదీన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి క్షేత్రస్థాయిలో ఆ భూములను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. కొన్నేండ్లుగా ఈ భూములనే నమ్ముకొని బతుకుతున్న రైతులకు నష్టం వాటిల్లకుండా తాను రైతుల పక్షానే పోరాటం చేస్తానని ఈ పరిశీలనలో ఎమ్మెల్యే రైతులకు హామీ ఇచ్చారు. ఈ 66 ఎకరాల్లో ఎకరా భూమితోపాటు పది గుంటల వరకు భూమి కలిగిన రై తులు 92 మంది ఉన్నారు. జూన్ 18వ తేదీన ప్రాథమిక ప్రకటన వచ్చి ఇప్పటికే 36 రోజులు గడిచింది. ఈ విషయంపై మున్సిపల్ పాలకవర్గం, నియోజకవర్గ నాయకులు, ఆయా రై తులు ఎలా స్పందిస్తారు? భూములను ప్రభుత్వానికి అప్పగిస్తారా? భూపోరాటం చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.