శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు మెదలయ్యాయి. కార్తీక మాసం తొలిరోజైన శుక్రవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసోత్సవాల సందర్భంగా భక్తులకు అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేశామని ఈ సందర్భంగా ఆలయ ఈవో లవన్న తెలిపారు. రద్దీ రోజుల్లో గర్బాలయ స్పర్శదర్శనాలు పూర్తిగా నిలిపివేసి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తుండటంతో స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు కూడా ఆలయ సిబ్బందితో సహకరించాలని ఈవో లవన్న కోరారు.
కార్తీక మాసాంతం ప్రతిరోజు సాయంత్రం ప్రధాన ధ్వజస్తంభంపై వెలిగించే ఆకాశదీప ప్రజ్వలన కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం శాస్ర్తోక్తంగా ప్రారంభించారు. నేటి నుండి నవంబర్ 23 వరకు జరిగే మాసోత్సవాల్లో భాగంగా ఆలయ దర్శన వేళలతోపాటు శని, ఆది, సోమ వారాలు, పౌర్ణమి, ఏకాదశి, ప్రభుత్వ సెలవులతో కలిపి 15 రోజులు రద్దీ ఉంటుందని భావిస్తూ ఆర్జిత సేవలలో పలు మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. క్షేత్రానికి వచ్చే భక్తులు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్ల టైం స్లాట్స్ ప్రకారం స్వామిఅమ్మవార్ల దర్శనం మాత్రమే ఉంటుందని, మూడువిడతలుగా జరిగే సామూహిక అభిషేకాలు, రుద్రహొమం మరియు చండీ హోమం, నిత్యకళ్యాణాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అల్పాహార భోజన ప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కార్తీక దీపాలు వెలిగించుకునేందుకు గంగాధర మండపం వద్ద మరియు ఆలయ ఉత్తర మాడవీధిలో చేసిన ప్రత్యేక ఏర్పాట్లను భక్తులు వినియోగించుకోవాలని కోరారు. చతుస్సప్తాహ భజనలతోపాటు ప్రతి సోమవారం మరియు పౌర్ణమి రోజున పుష్కరిణి వద్ద పుణ్య నదీ హారతి లక్ష దీపార్చన వైభవంగా జరిపించనున్నట్లు చెప్పారు. ఆలయ పరిధిలోని కీలక ప్రాంతాల్లో పర్యటించిన ఈఓ అధికారులకు సిబ్బందికి సూచనలు చేశారు.
ఉదయాస్తమాన ప్రదోషకాల సేవలు..
భక్తుల రద్దీతో సంబంధం లేకుండా మసాంతం ఉదయాస్తమాన మరియు ప్రదోషకాల సేవాకర్తలకు అన్ని సేవలు యదాతథంగా జరుగుతాయని తెలిపారు. ప్రతి రోజు కేవలం 6 టిక్కెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయిన చెప్పారు.
పౌర్ణమికి ప్రత్యేక పూజలు – ఏర్పాట్లు
పౌర్ణమి ఘడియలు ప్రారంభమైన రోజునే కృష్ణవేణి నదీమతల్లికి గంగా హరతి నిర్వహిస్తున్నటు తెలిపారు. అనంతరం గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణం కార్యక్రమం ఉంటుందని చెప్పారు. మరుసటి రోజు పౌర్ణమి ఉన్నప్పటికీ చంద్ర గ్రహణం కారణంగా ఆలయ ద్వారాలు మూసివేయనున్నట్లు తెలిపారు.
కార్తీక మాస ప్రారంభంగా ఆకాశ దీపాన్ని వెలిగిస్తున్న ఈవో స్వామి
అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తున్న అర్చకులు
శ్రీశైల క్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు