యాదాద్రి: కార్తిక శనివారం పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయం, అనుబంధ రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాగుతున్నది. ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆలయ తిరువీధులు, ముఖ మండపం, క్యూ కాంప్లెక్, క్యూ లైన్లు భక్తులతో నిండి పోయాయి.
కార్తిక మాసం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు సాగుతున్నాయి. శివాలయంలో శివుడికి దీపారాధన, ప్రత్యేక పూజలు చేశారు. కొండ కింద వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. స్వామి, అమ్మవార్లను పట్టువస్ర్తాలతో అలంకరించి గజవాహన సేవ చేశారు. అనంతరం తూర్పుకు అభిష్టంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి నిత్య తిరుకల్యాణోత్సవం సాగుతున్నది.