Bandi Sanjay | హైదరాబాద్, జనవరి8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్తున్న ప్రభుత్వం వాటినెలా తీరుస్తుందని, ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ రానున్న లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలవాలన్న అంశంపై కోర్కమిటీ సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. రాష్ట్రం నుంచి ఎక్కువమంది బీజేపీ ఎంపీలు గెలిస్తే ఎక్కువ నిధులు వస్తాయని, కాబట్టి ఆలోచించి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈటల రాజేందర్తో తనకు విభేదాలు ఉన్నట్టు వస్తున్న వార్తలపై స్పందిస్తూ అలాంటిదేమీ లేదని, అందరితో కలిసే ఉంటానని బండి తెలిపారు.
పార్టీ శాసనసభ్యులను పార్లమెంట్ ఇన్చార్జీలుగా నియమించామని, మరో రెండు రోజుల్లో పార్లమెంటు కన్వీనర్లను నియమిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. బూత్స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకోవడంపై కోర్కమిటీలో చర్చించినట్టు తెలిపారు. సంక్రాంతి తర్వాత ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని లోక్సభ స్థానాలకు పార్టీ ఇన్చార్జీలను నియమించినట్టు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.