కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో కరీంనగర్ నగరం అందంగా ముస్తాబవుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. నగరంలోని 6, 30వ వార్డుల్లో జరుగుతున్న స్మార్ట్ సిటీ పనులను నగర మేయర్ యాదగిరి సునీల్రావుతో కలిసి పరిశీలించారు. కరీంనగర్ అంటే సీఎం కేసీఆర్కు ప్రత్యేక అభిమానమని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ‘నో’ అనకుండా నిధులను విడుదల చేస్తున్నారన్నారు.
పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ నెల చివరి లోగా కేబుల్ బ్రిడ్జీని అందుబాటులోకి తీసుకురానున్నామని వెల్లడించారు. 2023 డిసెంబర్ లోగా మానేర్ రివర్ ఫ్రంట్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఓ వైపు స్మార్ట్ సిటీ, మున్సిపల్ నిధులు, మరోవైపు ముఖ్యమంత్రి హామీ నిధులతో పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. పనుల పురోగతి పై ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.
రోడ్ల పై ప్రమాదకరంగాఉన్న విద్యుత్ స్థంబాలను తొలగించాలని, రోడ్ల నిర్మాణ పనుల్లో నిబంధనలు, నాణ్యతలో రాజీ పడకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నగరవాసులు ప్రశాంత వాతావరణంలో నివసించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత 2వ పెద్ద నగరంగా కరీంనగర్ అభివృద్దిలో దూసుకుపోతుందన్నారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్,కార్పొరేటర్లు నేతికుంట యాదయ్య, కోల సంపత్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.