హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా కంటివెలుగు వైద్యశిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 96,07,764 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 15.65 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్ అందజేశారు. మరో 11.68 లక్షల మందికి ప్రిసిప్షన్ గ్లాసెస్కు ఆర్డర్ ఇచ్చారు. మొత్తం వంద పనిదినాల్లో కోటీ 70 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించాలన్నది లక్ష్యం కాగా.. 47 పనిదినాల్లోనే 96,07,764 మందికి కంటి పరీక్షలు పూర్తి చేయడం విశేషం. నిర్దేశిత లక్ష్యంలో 60. 55% పూర్తయ్యింది.
కోటి మందికి కంటి పరీక్షల మైలురాయిని అధిగమించే దిశగా అడుగులేస్తున్నది. ఇప్పటివరకు కంటి పరీక్షలు చేయించుకున్నవారిలో 50 లక్షల మంది స్త్రీలు, 45 లక్షల మంది పురుషులు, 3,112 మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు. కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో 68.73 లక్షల మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని వైద్యులు నిర్ధారించారు. రాష్ట్రంలోని 6,567 గ్రామ పంచాయతీల్లో 52% కంటివెలుగు లక్ష్యం పూర్తికాగా, మరో 946 గ్రామ పంచాయతీల్లో లక్ష్యానికి చేరువలో ఉన్నది. పురపాలక సంఘాల పరిధిలోని సుమారు 2,209 వార్డుల్లో 64.03% కంటి పరీక్షలు పూర్తి చేయగా, మరో 488 వార్డుల్లో పరీక్షలు కొనసాగుతున్నాయి. సెలవు దినాల్లో మినహా జూన్ 15 వరకు రెండో విడత కంటివెలుగు కొనసాగనున్నది.