హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): నివారింపదగిన అంధత్వ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కంటివెలుగు కార్యక్రమం అంచనాలకు అనుగుణంగా సాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా కనీసం కోటిన్నర మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని యంత్రాంగం టార్గెట్గా పెట్టుకున్నది. ఇందులో 55 లక్షల మందికి కండ్లద్దాలు అవసరం అవుతాయని అంచనా వేసింది. 30 లక్షల రీడింగ్ గ్లాసులు, 25 లక్షల ప్రిస్రిప్షన్ గ్లాసెస్ అవసరం అవుతాయని భావించింది. ఈ మేరకు ముందస్తుగా టెండర్లు పిలిచి, అద్దాలు సిద్ధం చేయించింది. కంటివెలుగు శిబిరాలు కొనసాగుతున్న కొద్దీ గణాంకాలను విశ్లేషిస్తే ప్రభుత్వ అంచనాలు వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉన్నట్టు స్పష్టమవుతున్నది.
కోటిన్నర మందిలో 30-35 శాతం మందికి దృష్టిలోపాలు ఉంటాయని ప్రభుత్వం ముందస్తుగా అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా కంటివెలుగు శిబిరాల ద్వారా గురువారం నాటికి 86.57 లక్షల మందికి పరీక్షలు చేసింది. వీరిలో 25 లక్షల మందికి కంటి సమస్యలు ఉన్నట్టు గుర్తించింది. మొత్తం స్క్రీనింగ్లో ఇది 29 శాతం. బాధితుల్లో దగ్గరి చూపు సమస్యలున్నవారే అధికంగా ఉంటారని ప్రభుత్వం భావించింది. అందుకే ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్తో పోల్చితే అదనంగా 5 లక్షల రీడింగ్ గ్లాసెస్కు ఆర్డర్ ఇచ్చింది. దీనికి తగ్గట్టే గురువారం నాటి గణాంకాలను పరిశీలిస్తే, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 14.46 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్ ఇవ్వగా, 10.62 లక్షల మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ కోసం రెఫర్ చేశారు.
ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుండటంతో స్క్రీనింగ్ విషయంలో మాత్రం అంచనాలకు మించి సాగుతున్నది. 100 రోజుల్లో కోటిన్నర మందికి పరీక్షలు చేయాలని సీఎం కేసీఆర్ లక్ష్యం నిర్దేశించారు. అంటే రోజుకు సగటున లక్షన్నర మందికి టెస్టులు చేయాలని అధికారులు భావించారు. అయితే, ఈ ఏడాది జనవరి 18న కార్యక్రమం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రోజుకు సగటున 2 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు.
నా కండ్లు కొన్నేండ్ల సంది మబ్బులు కనవడుతున్నయి. పైసల్లేక దవాఖాన్ల సూయించుకోలె. గిదే గ్రామపంచాయతీల 35 ఏండ్ల సంది స్వీపర్గా పనిజేస్తున్న. బయటకు పోయి సూయించుకునే ధైర్యం లేదు. కానీ, కండ్లకేమన్న అయితదేమోనని గుబులుపడ్డ. నా అసోంటోళ్లు మా ఊళ్లే మస్తు మంది ఉన్నరు. సీఎం కేసీఆర్ సారు కంటి వెలుగు శిబిరాలు పెడుతున్నడని తెలిసినంక శానా సంబురపడ్డ. అవసరమైనోళ్లు అద్దాలు తీస్కపోతున్నరు. ఇయ్యాల నేనుగూడ పరీక్ష జేయించుకొని అద్దాలు తీసుకపోదమని వచ్చిన. ముసలోళ్లకు మంచి సౌలతైన ముచ్చట.
-జోగాపురం రాములు, పారిశుద్ధ్య కార్మికుడు, తిమ్మాపూర్ గ్రామం, ఎల్లారెడ్డిపేట మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా