హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): అంధత్వరహిత తెలంగాణకోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటివెలుగు రెండో విడత బుధవారం ఖమ్మం వేదికగా ప్రారంభం కానున్నది. ఖమ్మం కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్య అతిథులుగా ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్మాన్, పినరాయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా హాజరుకానున్నారు. ఇందుకోసం ఖమ్మం కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంటి వెలుగు క్యాంపును ఏర్పాటు చేశారు.
తొలిరోజు మొత్తం 50 మందికి కంటి పరీక్షలు చేయనున్నారు. ఇందులో తొలి ఆరుగురికి కంటి పరీక్షల అనంతరం సీఎం కేసీఆర్, ఐదుగురు ముఖ్య అతిథులతో కలిసి కంటి అద్దాలు అందజేయనున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కంటివెలుగు కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం అవుతుంది. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కంటి వైద్య శిబిరాలు కొనసాగుతాయి. బుధవారం నుంచి నిర్దేశిత గ్రామాలు, పట్టణాల్లో క్యాంపులు ప్రారంభం అవుతాయి. అవసరమైన వారికి ఉచితంగా అద్దాలు, మందులు అందజేస్తారు. ఆపరేషన్ అవసరం ఉన్నవారికి శస్త్రచికిత్స రెఫర్ చేయిస్తారు.
ప్రతి ఒక్కరి వివరాలు భద్రంగా
కంటి పరీక్షలకు వచ్చేవారు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకొని రావాలి. అక్కడ సిబ్బంది వారి పేరు, ఫోన్ నంబర్, ఆధార్, చిరునామాలాంటి సమగ్ర వివరాలను సేకరిస్తారు. శిబిరంలో మొత్తం ఆరు దశల్లో పరీక్ష జరుగుతుంది. ప్రక్రియ మొత్తం ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా నిర్వహిస్తారు. బాధితుల వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉంటాయి. ఈ డేటా ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టడంతోపాటు ప్రజల కంటి ఆరోగ్యంపై పర్యవేక్షణకు అవకాశం కలుగుతుంది.
ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ నేరుగా ఏఎన్ఎంకు
శిబిరంలో దృష్టిలోపాలు గుర్తించినవారికి అక్కడికక్కడే రీడింగ్ గ్లాసులు అందజేస్తారు. ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరం ఉన్నవారికి కాస్త ఆలస్యంగా అందుతాయి. వైద్యుడి ప్రిస్క్రిప్షన్ను ఆన్లైన్లో అద్దాల తయారీ కంపెనీకి పంపుతారు. లబ్ధిదారుడి పేరు, చిరునామా, ఏ ప్రాంతంలో శిబిరం నిర్వహించారు? ఏ సబ్ సెంటర్/ ఏ ఏఎన్ఎం పరిధిలోకి వస్తుంది? లాంటి వివరాల ఆధారంగా ప్రిస్కిప్షన్ గ్లాసెస్ నేరుగా సంబంధిత ఏఎన్ఎంకు చేరుతాయి. అనంతరం వారు లబ్ధిదారుడికి అందజేస్తారు.
మొదటి విడతను మించి
మొదటి విడత కంటి వెలుగును మించి రెండో విడత నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడత కంటి వెలుగు సుమారు 8 నెలలపాటు కొనసాగింది. ఈ సారి దానిని అధిగమించేలా 100 పనిరోజుల్లో రెండో విడతను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో కార్యాచరణ రూపొందించి, అమలు చేస్తున్నారు. ఇందుకోసం వైద్య పరీక్ష బృందాల సంఖ్యను దాదాపు రెట్టింపు చేశారు. గతంలో 827 బృందాలు పనిచేయగా, ఈసారి ఏకంగా ఆ సంఖ్యను 1500కు పెంచారు. అదనపు సిబ్బందిని నియమించారు. అదనంగా 850 ఏఆర్ మెషీన్లను కొనుగోలు చేశారు. మొత్తంగా ఈ విడత కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.200 కోట్లు మంజూరు చేసింది.
సకల వసతులతో 16,533 క్యాంపులు
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,763 గ్రామాలు, పట్టణాల్లోని 3,788 ప్రాంతాల్లో (వార్డులు) కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. మొత్తంగా 16,533 ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. శిబిరం ప్రారంభం అయ్యేముందు ఆ ప్రాంతంలో విస్తృతంగా అవగాహన కల్పిస్తారు. ప్రతి ఇంటికీ ఆహ్వాన పత్రికను అందజేస్తున్నారు. మరోవైపు కంటి పరీక్షల కోసం ప్రభుత్వం ఇప్పటికే 1500 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.