మెదక్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): కంటి వెలుగు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 60 లక్షల మందికి నేత్రవైద్యం అందనున్నట్టు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు చెప్పారు. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి రూ.250 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే 30 లక్షల రీడింగ్ గ్లాసులను సిద్ధంగా ఉంచామని చెప్పారు. సోమవారం మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం మనోహరాబాద్లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వెలుగు అవగాహన సదస్సులో ఆ కార్యక్రమ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. కన్న పిల్లలు పట్టించుకోకపోతే వృద్ధాప్యంలో కంటిచూపుతో బాధపడుతున్న వారికి పెద్ద కొడుకులాగా సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా కంటి వెలుగు కార్యక్రమానికి ప్రారంభించారని చెప్పారు.
ఈ నెల 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని ఉద యం 9 గంటలకే బృందాలు వైద్యసేవలు ప్రారంభించాలని ఆదేశించారు. ఉదయం 9 నుంచి 4 గంటల వరకు క్యాంపులో ఉండాలని డాక్టర్లకు, ఏఎన్ఎంలకు, సిబ్బందికి సూచించారు. శిబిరాల బాధ్యతలను ఎంపీడీవోలు, ఎంపీవోలు తీసుకొని ప్రతి రోజు పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయాలు, రేషన్ షాపుల వద్ద, మున్సిపాలిటీల్లోని అన్ని వార్డుల్లో కూడా కంటి వెలుగు ఫ్లెక్సీలు ఏర్పా టు చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీల్లో మూడురోజుల ముందు డప్పు చాటింపు వేయించాలని, మున్సిపాలిటీల్లో ఆటోల ద్వారా మైకుల్లో ప్రచారం కల్పించాలని అన్నారు.
క్వాలిటీ కంట్రోల్ టీమ్ల ఏర్పాటు
రాష్ట్రస్థాయిలో, జిల్లాస్థాయిలో క్వాలిటీ కం ట్రోల్ టీమ్లను ఏర్పాటుచేశామని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఏ వైద్య బృందం ఏ జిల్లాకు ఎప్పుడు వెళ్తాయో తెలియదని, ఆ సమయంలో కంటి వెలుగు శిబిరంలో డాక్టర్లతోపాటు సిబ్బంది ఉండాలని సూచించారు. ఈ టీం నిరంతరం పర్యవేక్షిస్తుందని చెప్పారు. కార్యక్రమాన్ని వంద రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖపై ఉన్నదని ఆదేశించారు. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కంటి వెలుగుపై అవగాహన కల్పించాలన్నారు. గ్రామంలో సర్పంచులు, ఎంపీటీసీ లు, అందరి భాగస్వామ్యంతో కంటి వెలుగును విజయవంతం చేయాలని కోరారు. శని, ఆదివారాలు శిబిరాలు పనిచేయవని చెప్పారు.
సర్కారు వైద్యం బలోపేతానికి రాష్ట్రవ్యాప్తంగా 926 మంది డాక్టర్లను నియమించామని, త్వ రలో వైద్య విధాన పరిషత్ ద్వారా మరో 1300 డాక్టర్లను నియమిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలతశేఖర్గౌడ్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జిల్లా కలెక్టర్ ఎస్ హరీశ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్రెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
66 % ప్రసవాలే ప్రత్యక్ష నిదర్శనం
హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్యారోగ్య రంగాన్ని సీఎం కేసీఆర్ ఎంతో బలోపేతం చేశారని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రభుత్వం మార్గనిర్దేశనం, అధికారులు, సిబ్బంది సమిష్టి కృషి వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం ఎంతగానో పెరిగిందని అన్నారు. 66 శాతం మంది ప్రసవాలు చేసుకునేందుకు ప్రభుత్వ దవాఖానలకే వస్తుండటమే దీనికి నిదర్శనమని చెప్పారు. ఇన్నేండ్ల కృషి వల్ల ప్రజల్లో పెరిగిన నమ్మకాన్ని మనం కాపాడుకోవాలని, దానిని నిలబెట్టుకునేందుకు మరింత కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని దవాఖాన పనితీరుపై మంత్రి హరీశ్రావు సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రారంభించిన 56 టిఫా సానింగ్ సేవలు గర్బిణులకు అందేలా చూడాలని అన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సిజేరియన్లు ఎకువగా జరుగుతున్నాయని, వాటిని తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మందుల కోసం బయటకు రిఫర్ చేయకూడదని అన్నారు. డిశ్చార్జ్ అయిన పేషెంట్లకు కావాల్సిన మందులు ఇచ్చి పంపాలన్నారు.