CM KCR | నిజామాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు కామారెడ్డి జై కొడుతున్నది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్తోపాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు. సీఎం కేసీఆర్కు మద్దతుగా గ్రామాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. ఆయా తీర్మానాలను మండల పార్టీ అధ్యక్షులకు, సర్పంచులకు అందజేస్తున్నారు. పలు గ్రామాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి తమ అభిమానం చాటుకుంటున్నారు. తాజాగా కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలోవైశ్య, రెడ్డి, గౌడ, హోలియా దాసరి, ఒడ్డెర తదితర సామాజికవర్గానికి చెందిన వారంతా స్వచ్ఛందంగా ర్యాలీ నిర్వహించి, సీఎం కేసీఆర్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కేసీఆర్తోపాటు స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
బీఆర్ఎస్కే ఓటు వేస్తామంటూ ఏకగ్రీవం తీర్మానం చేసి, ఆ కాపీని స్థానిక సర్పంచ్కు అందజేశారు. అభివృద్ధిలో రాష్ర్టాన్ని కొత్త పుంతలు తొక్కించిన కేసీఆర్కు తామంతా మద్దతు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు, పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, సకాలంలో ఎరువులు, విత్తనాలు సరఫరా వంటి చర్యలతో అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు. కేసీఆర్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందితే తమ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని, ఆయనను భారీ మెజారిటీ గెలిపించి గౌరవించుకుంటామని అంటున్నారు. మాచారెడ్డి, బీబీపేట, దోమకొండ, కామారెడ్డి, రామారెడ్డి, భిక్కనూర్ మండలాల్లో కుల సంఘాల బాధ్యులంతా ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతుగా తీర్మానాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
కాంగ్రెస్ కకావికలం
అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందే కాంగ్రెస్ కకావికలం అవుతున్నది. కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ బరిలో నిలుస్తున్నట్టుగా ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్అలీకి మరోసారి ఓటమి భయం పట్టుకున్నది. కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా డీలా పడిపోయారు. కేసీఆర్పై పోటీ చేయడం కన్నా మిన్నకుండి పోవడం ఉత్తమం అంటూ పార్టీ శ్రేణులు సలహాలిస్తుండటంతో షబ్బీర్అలీ దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నారు. కార్యకర్తలను కాపాడుకోవడం కోసం ఆపసోపాలు పడుతున్నారు. తీవ్ర ఒత్తిడిలో ఉన్న షబ్బీర్అలీ ఉచిత విద్యుత్తుపై బురద జల్లుతూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్తుశాఖ మంత్రిగా షబ్బీర్అలీ పనిచేసిన రోజుల్లో (2004-09) కటికచీకట్లో బతకాల్సి వచ్చిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
కేసీఆర్కే మా మద్దతు
కేసీఆర్ సార్కే ఈసారి మా మద్దతు ఉంటది. తెలంగాణ వచ్చినంక పేదోళ్ల కోసం చాలా చేస్తుండు. ఈడ్నుంచి పోటీ చేస్తానని తెల్వంగనే ఆనందమేసింది. అంత పెద్ద సారు కామారెడ్డి కెల్లి పోటీ చేస్తుండంటే ఇక్కడోళ్లకు మంచి విషయమే.
– లింబవ్వ, గర్గుల్ గ్రామస్థురాలు
ముసలోళ్లకు దేవుడైండు
మాలాంటి ముసలోళ్లకు కేసీఆర్ దేవుడైండు. పింఛన్లు ఇచ్చి ఆదుకుంటుండు. మునుపు రెండొందల పింఛన్కు మస్త్ ఇబ్బంది అయితుండే. ఇప్పుడైతే ఎసుంటి ఇబ్బంది లేదు. నెల అయిన వెంటనే రూ.2 వేలు చేతికొస్తున్నయ్. మాకు ఆసరాగా నిలబడ్డ కేసీఆర్ మా కామారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసుడంటే మా అందరికీ మంచిదే.
– సాయవ్వ, గర్గుల్ గ్రామస్థురాలు