హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని పెంటఖుర్దులో (Pentakhurdu) కొత్త కల్యాణి చాళుక్యుల శాసనం వెలుగు చూసిందని కొత్త తెలంగాణ చరిత్రబృందం కన్వీనర్, చరిత్రకారులు శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. గ్రామానికి చెందిన శివాలాయ భక్తుల కృషివల్ల ఈ శాసనం గురించి తెలియవచ్చిందని చెప్పారు. ‘పెంటఖుర్దులో శిథిల శివాలయముండేది. 1984లో నాటి గ్రామ సర్పంచు పరుచూరు రాంచందర్ రావు, యలవర్తి జయరామారావు, కొడాలి సూర్యుడమ్మ ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారు. ఈ సందర్భంగా పురాత ఆలయ శిథిలాలలో లభించిన శాసనస్తంభాన్ని భద్రపరిచారు. ఈ శాసనంలోని విషయాన్ని తెలుసుకోవడానికి గ్రామానికి నివాసులు బీవీ భాస్కర్ రెడ్డి, గడ్డం వీరరాజారావు, మద్దినేని శ్రీనివాసరావు, ముక్కల శ్రీనివాసరెడ్డి, కొత్తపల్లి నాగేశ్వరరావు, చిట్టెం శివసాయిపటేల్, గైని గంగారాం, జంగం సంజప్ప, నాగల్ల కోటేశ్వరరావు, బీ.నాగిరెడ్డి, డీ.హరీశ్ చేసిన కృషివల్ల కొత్తశాసనం వెలుగులోకి వచ్చింది.
శ్రీశ్రీమల్లికార్జున దేవాలయ ప్రాంగణంలో నిలిపివున్న రాతిస్తంభానికి మూడు వైపులా 47 పంక్తులలో 11వ శతాబ్దపు తెలుగున్నడలిపిలో, కన్నడభాషలో చెక్కబడిన శిలాశాసనం ఉన్నది. కల్యాణీచాళుక్య చక్రవర్తి త్రైలోక్యమల్లదేవర పాలనాకాలంలో క్రీ.శ.1058 మార్చి 10వ తేదీన వేయబడిన సావడిగేయ పొంరయ అనే భక్తుడు నకరేశ్వరదేవాలయం కొరకు చేసిన దానాలు గురువు దివాకర భట్టారకయ్యకు అందజేశాడు. కొంతభూమి గుడి నిర్వహణకు దానంచేయబడింది. సూర్యగ్రహణ సందర్భంగా చేసిన దానాలలో గుడికి చెల్లేటట్లు బాటసుంకం, బిట్టకొట్టసుంకం వంటి కొన్నిరకాల పన్నులు మాఫీచేయబడ్డాయి. పెంటఖుర్దుకు 4 కిలోమీటర్ల దూరంలోని కోటవున్న కోటగిరి వద్ద తోట, బావి, 25 రూకల ద్రవ్యమిచ్చినట్లు శాసనం ద్వారా తెలుస్తున్నది. ఈ శాసనం ఆనాటి సామాజిక సంస్కృతికి అద్దంపడ్తున్నది. పేరులోనే ప్రాచీనతను దాచుకున్న గ్రామం పెంటఖుర్దు.’ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు.