మహబూబ్నగర్ : గతంలో కల్యాణ లక్ష్మి పథకం లేదు. ఆడబిడ్డల పెళ్లి చేయాలంటే అప్పు చేయాల్సిందే. ఆస్తులు అమ్ముకోవాల్సిందే అనే విధంగా పరిస్థితి ఉండేది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదింటి ఆడ బిడ్డల పెళ్లిళ్ల కోసం రూ.1,01,116 సాయంగా అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందనిదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హన్వాడ మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు.
గతంలో కనీసం మంచినీళ్లు కూడా లభించే పరిస్థితి లేదు. ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి శుద్ధమైన కృష్ణా జలాలను అందిస్తున్నాం. ఒకప్పుడు వ్యవసాయానికి మూడు గంటల కరెంటు గగనంగా ఉండేది.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయానికి మూడు గంటలకు కరెంటు మాత్రమే ఇచ్చి అన్నదాతను ఆగం చేశారు. నేడు అన్నదాత సంక్షేమం కోసం 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు.
గతంలో రైతు అనుకోకుండా మరణిస్తే కనీసం ఒక రూపాయి పరిహారం కూడా లభించేది కాదు. ఇప్పడు అనుకోకుండా రైతు మరణిస్తే రూ.5 లక్షల రైతు బీమా అందించి ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, తాసిల్దార్ కిష్టానాయక్, జెడ్పీటీసీ విజయనిర్మల, వైస్ ఎంపీపీ లక్ష్మీ మోహన్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కరుణాకర్ గౌడ్, జిల్లా రైతుబంధు సమితి డైరెక్టర్ కొండ లక్ష్మయ్య, మండల కో ఆప్షన్ సభ్యుడు మన్నన్, ఎంపీడీవో ధనుంజయ, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బాలా గౌడ్, సర్పంచ్ రేవతి సత్యం, ఎంపీటీసీ యాదయ్య, జంబులయ్య, తదితరులు పాల్గొన్నారు.