హైదరాబాద్ : ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్ను కాళోజీ నారాయణరావు పురస్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ అవార్డుతో పాటు రూ. రూ.1,01,116 నగదు బహుమతి, జ్ఞాపికతో ఆయనను ప్రభుత్వం సత్కరించనున్నది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఉద్యమానికి ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు ఇచ్చిన స్ఫూర్తిని స్మరించుకుంటూ ఆయన జయంతి రోజైన సెప్టెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం సాహిత్యంలో విశేష కృషి చేసినవారికి ఈ అవార్డును ఇస్తున్నది. 2021 సంవత్సరానికి గానూ పెన్నా శివరామకృష్ణను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఏడాది కాళోజీ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం విదితమే.