హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లకు మరమ్మతులు చేస్తున్నామంటూ రేవంత్రెడ్డి సర్కార్ చేస్తున్న హడావుడికి, క్షేత్రస్థాయి పనులకు ఎక్కడా పొంతనలేదు. డెడ్లైన్లు విధించుకోవడం, అవి దాటిపోవడం, మళ్లీ కొత్తగా డెడ్లైన్లు ప్రకటించడం పరిపాటిగా మారింది. ఇప్పటికే వానకాలం ప్రారంభం కాగా, ఉన్న స్వల్ప సమయంలో సాంకేతిక పరీక్షలు పూర్తయ్యే పరిస్థితులే కనబడటం లేదు. మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ పనులను ఎన్డీఎస్ఏ నివేదిక సూచనల మేరకు చేపట్టాల్సి ఉంటుంది.
అందులో భాగంగా బరాజ్లకు సంబంధించి జియోఫిజికల్, జియో టెక్నికల్, జియో పెనెట్రేటింగ్ రాడార్ టెస్ట్లను పుణెలోని సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్) ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉన్నది. ఆ టెస్టుల నివేదికలను సీడబ్ల్యూసీ, ఎన్డీఎస్ఏకు పంపి, డిజైన్లను కూడా రూపొందించి వాటికి ఆమోదం పొందిన తరువాత పనులను చేపట్టాల్సి ఉంటుంది. టెస్టులను మే ఆఖరులోగా పూర్తి చేస్తామని సర్కార్ ప్రకటించింది. అందుకు సంబంధించి రోజువారీ ప్రణాళికలను రూపొందించుకొన్నామని తెలిపింది. సమీక్షల మీద సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ హంగామా చేసింది. అక్కడితో ఆగకుండా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్, వివేక్తో కలిసి అట్టహాసంగా మేడిగడ్డలో పర్యటించి హడావుడి చేశారు.
ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్జైన్, సీడబ్ల్యూపీఆర్ఎస్ డైరెక్టర్ సెల్వబాలన్, ఇరిగేషన్ శాఖ అధికారులను వెంటబెట్టుకుని మరీ వెళ్లి క్షేత్రస్థాయిలో పనులు కొనసాగిస్తున్నామని చెప్పారు. ఆచరణలో ప్రస్తుతం ఎక్కడి పరీక్షలు అక్క డే పెండింగ్లో ఉన్నాయి. అరకొరగానే బోర్హోల్స్ పరీక్షలు కొనసాగుతుండగా, అత్యధిక సాంకేతిక పరీక్షలు ప్రారంభమే కాలేదు. సీడబ్ల్యూపీఆర్ఎస్ ఆధ్వర్యంలో జీపీఆర్ (గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్) సానింగ్ , డ్రోన్ సర్వేలు, బోర్ హోల్స్, జియోటెక్నికల్, జియోఫిజికల్ తదితర సాంకేతిక పరీక్షలు, అధ్యయనాలు నిర్వహించాల్సి ఉండగా, క్షేత్రస్థాయిలో అవి ముందుకు సాగడం లేదు. వానలు జోరందుకుంటే గోదావరిలో, మరీ ముఖ్యంగా మేడిగడ్డ వద్ద ప్రాణహితలో వరద ప్రవాహాలు ప్రారంభం కానున్నాయి. నీటి ప్రవాహాలు ఆరంభమైతే సాంకేతిక పరీక్షల నిర్వహణ ముందుకుసాగడం కష్టమే. ఆ తరువాత మళ్లీ వరదలు తగ్గే వరకు అంటే నవంబర్, డిసెంబర్ వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది.
