7 ఆగస్టు, 2016 ,కోమటిబండ, గజ్వేల్ నియోజకవర్గం, మిషన్ భగీరథ ప్రారంభోత్సవంప్రధానమంత్రి నరేంద్రమోదీకి కొన్ని సమస్యలు విన్నవించదలచుకొన్నాను. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసమే జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా, గోదావరి నదులనుంచి సుమారు 1300 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. తెలంగాణ కోసం ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా మంజూరు చేయాలని కోరుతున్నా..
-కే చంద్రశేఖర్రావు, ముఖ్యమంత్రి
‘ఇకపై దేశంలో ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇచ్చే విధానం ఉండదు’
-పార్లమెంట్లో జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ
ఈ ప్రకటన చేసిన కేంద్రమే 2021 డిసెంబర్లో కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. దీనికి కేంద్ర జలసంఘం నుంచే పూర్తి అనుమతులు లేవు. ఇక యూపీ, మధ్యప్రదేశ్ మధ్య కెన్ బెత్వా రివర్లింక్ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇచ్చేశారు. దీనికీ ఎలాంటి అనుమతులు రాలేదు. దశాబ్దాల తరబడి నీటికోసం గోసపడి.. కనాకష్టం పడి రాష్ట్రం తెచ్చుకొని.. అన్ని అనుమతులనూ సాధించుకొన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే మాత్రం దేశంలోనే ఎక్కడా ఇవ్వడం లేదని చెప్తారు. మరి మాకొద్దా జాతీయ హోదా?
అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రభుత్వం చట్టసభల సాక్షిగా తీసుకొనే నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి. ప్రభుత్వం మారినప్పుడల్లా ఇష్టంవచ్చినట్టు మార్చటం జరుగదు. భారత పార్లమెంటుకు ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యం, గొప్ప గౌరవం ఉన్నాయంటే ఈ ప్రజాస్వామ్య సౌధం చేస్తున్న చట్టాల్లోని స్థిరత్వమే కారణం. కానీ, కేంద్రంలో నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అంతకుముందు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు, చేసిన చట్టాలను ధ్వంసం చేయటం మొదలుపెట్టింది. ఆ ధ్వంస రచనలో దారుణంగా బలైంది తెలంగాణ రాష్ట్రమే.
హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వివక్ష, చిన్నచూపు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మోదీ ప్రభుత్వ మొదటి క్యాబినెట్ సమావేశంలోనే తెలంగాణలోని ఏడు మండలాలను, అత్యంత కీలకమైన ఓ జలవిద్యుత్తు ప్రాజెక్టును అక్రమంగా లాగేసుకొన్నది. ఇక అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పార్లమెంటు సాక్షిగా తెలంగాణకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నిరాకరిస్తూ వస్తున్నది. నిధుల కేటాయింపులో, జాతీయ సంస్థల మంజూరులో, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ప్రకటించడంలో.. ప్రతి అంశంలోనూ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తున్నది. ప్రగతి పథంలో దూసుకుపోతున్న రాష్ర్టాలను విస్మరిస్తూ బీజేపీ పాలిత రాష్ర్టాలకు పట్టం గడుతున్నది. ఒక రాష్ట్రం అత్యధిక జనాభాకు ప్రయోజనం చేకూర్చేలా బహుళ ప్రయోజనాలతో కూడిన సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేపడితే రాష్ట్రంపై ఆర్థిక భారం పడకుండా కేంద్రం జాతీయ హోదాను ప్రకటిస్తుంది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మొత్తం కేంద్రమే భరిస్తుంది.
జాతీయ హోదా ఇవ్వటానికి కేంద్రం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. అయినప్పటికీ కేంద్రం ఈ ప్రాజెక్టుకు హోదా ఇవ్వలేదు. ప్రాజెక్టు ఆలోచన పురుడుపోసుకొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకొన్న పాపాన పోలేదు. సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీని కలిసి విన్నవించినా ఫలితం లేదు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడంతోపాటుగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగునీటిని అందించేందుకు చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీ య హోదా ఇచ్చే అవకాశమున్నా కేంద్రం నిరాకరిస్తున్నది.
మనకు లేదని చెప్పి.. ఇతర రాష్ట్రాలకు హోదా
ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వటంలో బీజేపీ సర్కారు దేశప్రయోజనాలను గాలికొదిలేసి పక్కా రాజకీయాలు మొదలుపెట్టిందనే విమర్శలున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16 నేషనల్ ప్రాజెక్టులున్నాయి. ఇందులో బీజేపీ అధికారంలోకి వచ్చాక హోదా ఇచ్చినవి పోలవరం, కెన్-బెట్వా. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారని చెప్తూ పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. ఉత్తరప్రదేశ్- మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కెన్-బెట్వా రివర్ లింక్ ప్రాజెక్టుకు నేషనల్ స్టేటస్ ఇచ్చారు. ఆ సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇదే విషయాన్ని తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లో ప్రస్తావించారు. దీనిపై అప్పటి జల్శక్తి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందిస్తూ ‘ఇకపై ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చే విధానం ఉండదు. ఏ ప్రాజెక్టుకు నేషనల్ స్టేటస్ను ఇచ్చేది లేదు’ అని విస్పష్టంగా ప్రకటించారు. ఆ ప్రకటన చేసిన కొంత కాలానికే కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన అప్పర్భద్ర ప్రాజెక్టుకు కేంద్రం జాతీయహోదా ప్రకటించింది. రోజూ మీడియా హెడ్లైన్స్లో ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేలే రాష్ట్ర బీజేపీ ఎంపీలు కేంద్రం వివక్షపై ఇప్పటికీ నోరు మెదుపలేదు.
నేషనల్ ప్రాజెక్టు హోదా పొందాలంటే..
భారీ ప్రాజెక్టు కావడంతో బహుళార్థక ప్రయోజనాలుండాలి.
ప్రాజెక్టు కింద కొత్త ఆయకట్టు 7.5 లక్షల ఎకరాలకు పైగా ఉండాలి.
దుర్భిక్ష, కరువు పీడిత ప్రాంతాలకు ప్రయోజనం కలగాలి.
సీడబ్ల్యూసీలోని హైడ్రాలజీ, టీఏసీ సహా అన్ని డైరెక్టరీల నుంచీ అనుమతులు పొందాలి.
ముంపు జలాల వినియోగం, నష్ట పరిహారం తదితర అంశాల్లో
ఎలాంటి అంతరాష్ట్ర వివాదాలు ఉండకూడదు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల
120 టీఎంసీల సామర్థ్యం
12.3 లక్షల ఎకరాల ఆయకట్టు
నిర్మాణ వ్యయం రూ.38,500 కోట్లు (అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్)
పూర్తిగా కరువు ప్రాంతమైన మహబూబ్నగర్, ఫ్లోరైడ్ బాధిత నల్లగొండ జిల్లాకు లబ్ధి.
కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టతలు..
140-194 టీఎంసీల నీరు ఎత్తిపోత.
కొత్త ఆయకట్టు 18.25 లక్షల ఎకరాలు.
ప్రాజెక్టు ద్వారా లబ్ధిపొందే దుర్భిక్ష ప్రాంతాలు
ఉమ్మడి మెదక్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలు.
నిర్మాణ వ్యయం రూ.80 వేల కోట్లకు పైనే.
పారిశ్రామిక అవసరాలకు 16 టీఎంసీలు.
తాగునీటి అవసరాలకు 40 టీఎంసీలు.
ఏడేండ్లుగా సీఎం కేసీఆర్ విజ్ఞప్తులు
ఇటీవల కేంద్రం జాతీయ హోదా పొందిన ప్రాజెక్టులు
పోలవరం ప్రాజెక్టు
‘కెన్-బెత్వా’ రివల్ లింక్
అప్పర్ భద్ర