హుస్నాబాద్, ఏప్రిల్ 18: కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బరాజ్కు మరమ్మతులు చేపట్టి మెట్ట ప్రాంతాలకు నీళ్లందించకపోతే రైతులు, ప్రజలు సీఎం రేవంత్రెడ్డిని ఉరికిచ్చి కొట్టే పరిస్థితి వస్తుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ హెచ్చరించారు. తెలంగాణకు కరువు వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప వేరే ఆధారం లేదని గుర్తించేందుకు ముఖ్యమంత్రికి రెండున్నరేండ్లు పట్టిందని దుయ్యబట్టారు. శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మేడిగడ్డ వద్దనే నీటివనరులు ఎక్కువ అని గుర్తించే అప్పటి సీఎం కేసీఆర్ అక్కడ బరాజ్ నిర్మించినట్టు చెప్పారు. కాంగ్రెస్ చెప్పిన అబద్ధాలు ప్రజలకు అర్థమవుతున్నాయని, రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారడం ఖాయమని అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ శాపంగా మారాయని విమర్శించారు. వారి స్వార్థ రాజకీయాలు, అహంకారం వల్లే బిల్లు వీగిపోయిందని దుయ్యబట్టారు.