వరంగల్ : తెలంగాణ ఉద్యమ సమయంలో 1200 మంది విద్యార్థుల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ సమాజం క్షమించదని కాకతీయ యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ బొల్లికొండ వీరేందర్ తేల్చిచెప్పారు. రాహుల్ గాంధీ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పబ్బుల్లో, క్లబ్బుల్లో కాలక్షేపం చేసే రాహుల్.. ఓయూలోకి అడుగుపెట్టి విద్యార్థులకు ఏం చెప్పదలచుకున్నాడో కాంగ్రెస్ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీని నడిపించలేని అసమర్థ నాయకుడు రాహుల్ అని ధ్వజమెత్తారు.
అనంతరం డాక్టర్ మేడారపు సుధాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ విద్యార్థి అమరవీరుల కుటుంబాలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలలో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని కాంగ్రెస్ పార్టీ చెడగొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ జాగృతి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అబ్బోజు శ్రీకాంత్, మైనార్టీ విద్యార్థి సంఘం నాయకులు సయ్యద్ అతిక్, మహమ్మద్ ముజాహిద్, జోగు కుమార్, ఈదురు అనిల్ కుమార్, దుగ్యాల కుమార్, సాయినాథ్, అక్బర్, రహమత్, తదితరులు పాల్గొన్నారు.