హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు (K.Keshava Rao) భేటీ అయ్యారు. డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డితో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన కేకే.. ముఖ్యమంత్రితో పార్టీ చేరికకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తున్నది. తాను బీఆర్ఎస్ నుంచి సొంతగూటికి చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం విధితమే. ఆయన కూతురు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇటీవల వారితో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షి కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి తిరిగిరావాలని ఆహ్వానించారని చెప్పారు. దీంతో 84 ఏండ్ల వయసులో తిరిగి సొంత ఇంటికి వెళ్లాలన్న ఆలోచన తనకు కూడా కలిగిందని కేకే అన్నారు.
బీఆర్ఎస్లో తనకు సముచిత గౌరవం దక్కిందని, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తనకు గౌరవం ఇచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా తనను బాగా చూసుకున్నారని అన్నారు. తాను, తన కుమార్తె, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి వెళ్లాలన్న ఆలోచనతో ఉన్నామ ని చెప్పారు. తన కుమారుడు విప్లవ్ బీఆర్ఎస్లోనే కొనసాగుతానని చెప్పాడని వెల్లడించారు.