జనగామ : జిల్లా పర్యటనలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ సుడిగాలి పర్యటన చేశారు. పాలకుర్తి మండలంలోని శాతాపురంలో పలు సీసీ రోడ్లు, డబుల్ బెడ్ రూం ఇండ్లకు శంకుస్థాపన, చెన్నూరులో గ్రామపంచాయతీ భవనం, రైతువేదికల ప్రారంభోత్సవం, పెద్ద తండా(బి) లో గ్రామ పంచాయతీలను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..అన్ని కులాలు, వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారు. దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు.
కరోనాతో అభివృద్ధికి ఆటంకంగా మారింది. అయినా సీఎం కేసీఆర్ తన చాణక్యంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎక్కడా ఆపలేదని గుర్తు చేశారు. ఇంత కష్ట కాలంలో కూడా దళితులకు దళిత బంధు ఇస్తున్నాం. పేదలకు ఇండ్లు ఇస్తున్నాం. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని తెలిపారు. అన్ని గ్రామాల్లో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని సూచించారు.
కొందరు నాయకులు రాజకీయం చేస్తూ..కేంద్రం నుంచి అనేక నిధులు వస్తున్నాయని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు.
ఊళ్లలో నిజమైన పేదోల్లు దళితులు. అందుకే వాళ్లకు రూ.10 లక్షలు ఇస్తున్నాం. ముందుగా దళితులు, తరువాత ఎస్టీలు, బీసీలకు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.