జోగులాంబ గద్వాల్ : వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అమరచింత మండల పరిధిలోని ప్రియదర్శని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. ఎగువప్రాంతాల్లోని నారాయణపూర్, ఆల్మట్టి ప్రాజెక్టుల నుంచి భారీగా వరదనీరు చేరుతున్నది. దీంతో ప్రాజెక్టు అధికారులు 18 గేట్లు ఎత్తి 1,07,865 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి 92 వేల క్యూసెక్కుల నీరు జూరాల ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది.
శ్రీశైల జలాశయానికి లక్ష క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వరద మొదలైంది. బుధవారం జూరాల ప్రాజెక్టు స్పిల్వే ద్వారా 67,428 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 38,394 క్యూసెక్కుల నీరు విడుదలై మెత్తం 1,05,822 క్యూసెక్కులు శ్రీశైల జలాశయానికి చేరుకుంటున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 826.90 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 46.51 టీఎంసీల నీటినిల్వ ఉంది.
జూరాలకు భారీగా వరద పోటెత్తడంతో.. 18 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.. pic.twitter.com/EH2jxYFCGp
— Namasthe Telangana (@ntdailyonline) July 13, 2022