మన్సూరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): న్యూస్లైన్ జర్నలిస్టు శంకర్పై దాడి ఘటనలో ఎల్బీనగర్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎస్సై మధు కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, తుర్కయాంజల్కు చెందిన చెలమల శంకర్ జర్నలిస్టు. ‘న్యూస్లైన్’ పేరుతో యూట్యూబ్ చానల్, ‘తెలంగాణం’ పేరుతో తెలుగు ఆన్లైన్ పత్రికను నిర్వహిస్తున్నాడు. శంకర్ తన సహచర జర్నలిస్టులు దండిగ నర్సింహా, పుల్కారం శివతో కలిసి సిరీస్ రోడ్డులోని తమ కార్యాలయం నుంచి గురువారం రాత్రి 10:40 గంటల సమయంలో తుర్కయాంజల్కు బయలుదేరారు. కారు కొద్దిపాటి దూరం చేరగానే ఓ వ్యక్తి అడ్డుగా వచ్చాడు. దీంతో కారును స్లో చేయగా ఇద్దరు యువతులు హోండా యాక్టివాతో ఢీకొట్టారు. శంకర్ కారు నుంచి దిగి యువతులను ప్రశ్నిస్తుండగా వారు అసభ్య పదజాలంతో దూషణకు పాల్పడ్డారు. తప్పు చేసింది మీరే కదా? అని అంటుండగానే సదరు యువతులకు తెలిసిన కొందరు యువకులు బైకులపై వచ్చారు. శంకర్పై చేతులతో, రాళ్లతో దాడి చేశారు. వారిని అడ్డుకొనేందుకు యత్నించిన నర్సింహా, శివపై దాడి చేశారు. ఈ ఘటను చిత్రీకరిస్తున్న శివను అడ్డుకొని సెల్ఫోన్ను పగులగొట్టారు. శంకర్కు చెందిన రెండు సెల్ఫోన్లను సదరు యువకులు అపహరించుకుపోయారు. ఈ ఘటనలో శంకర్కు తీవ్ర గాయా కాగా, ప్రస్తుతం సోమాజిగూడలోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. దండిగ నర్సింహా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుతో సంబంధం ఉన్న కవాడిగూడకు చెందిన ప్రవీణ్, హయత్నగర్, ఎల్లారెడ్డికాలనీకి చెందిన మహేశ్ను అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులే తమను అసభ్య పదజాలంతో దూషించారంటూ నల్లగొండ, ఎస్ఎల్ఎన్ స్వామి కాలనీకి చెందిన శ్రీదుర్గ అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హోండా యాక్టివాపై తన మిత్రురాలితో వెళ్తుండగా కారును సడన్ బ్రేక్ వేసి ఆపారని, ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి కారును బైక్ ఢీకొట్టిందని, కారు నుంచి దిగిన వ్యక్తులు తమను అసభ్య పదజాలంతో దూషించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నది. తమ మిత్రులు దూషణలకు పాల్పడుతున్న వారిని ప్రశ్నించారని వెల్లడించింది.
శంకర్కు బీఆర్ఎస్ నేతల పరామర్శ
యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న శంకర్ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, క్రాంతి కిరణ్, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, జీవన్రెడ్డి, రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి పరామర్శించారు. వైద్యం అందుతున్న తీరును పర్యవేక్షించారు. శంకర్పై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నేతల హస్తం: దండిగ నర్సింహా
శంకర్, శివతోపాటు తనపై జరిగిన దాడిలో కుట్ర కోణం ఉన్నదని నర్సింహా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు, తప్పిదాలను ప్రశ్నిస్తున్నందుకే కాపు కాసి దాడి చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు కొండగల్లో పేదల అసైన్డ్ భూములు లాక్కుంటున్నారనే విషయంపై ఇటీవల తాము కథనం ప్రసారం చేసినట్టు చెప్పారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ వారే తమపై దాడులకు పాల్పడ్డారని తెలిపారు. ఈ నెల 21న కొందరు తమ కార్యాలయం గురించి స్థానికంగా వాకబు చేశారని, తమ కార్యాలయంలోని సీసీటీవీ కెమెరాలతోపాటు పరిసర ప్రాంత సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తే తమపై దాడి యాదృచ్ఛికంగా జరుగలేదని తెలుస్తుందన్నారు. రెక్కీ చేసి దాడి చేసినట్టు స్పష్టమవుతుందని చెప్పారు. కావాలనే ఓ వ్యక్తి అడ్డుగా వచ్చి.. ముందుకు వెనుకకు తచ్చాడుతూ కారు సడన్ బ్రేక్ వేసేలా చేశాడని ఆరోపించారు. కుట్రలో భాగంగానే ఇద్దరు యువతులు వెనుక నుంచి వచ్చి బైకుతో ఢీకొట్టారని, రెండు నిమిషాల్లోనే పదిహేను మంది యువకులు అక్కడికి బైకుపై వచ్చి తమపై హత్యాయత్నం చేశారని చెప్పారు. కారుకు అడ్డు వచ్చిన వ్యక్తి సైతం తమపై జరిగిన దాడిలో పాల్గొన్నాడని తెలిపారు.
తెలంగాణలో మొదలైన ఎమర్జెన్సీ
తెలంగాణలో ఎమర్జెన్సీ మొదలయ్యిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలపక్షాన ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగుతారా? అని నిలదీశారు. సీనియర్ జర్నలిస్టు శంకర్పై దాడిని ఆయన ఎక్స్ వేదికగా ఖండించారు. మీడియాపై దాడి అంటే ప్రజాస్వామ్యంపైనే దాడి అని అభివర్ణించారు. తెలంగాణలో ఫ్యాక్షన్ దాడుల సంస్కృతి మొదలయ్యిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయంలో సీఎం రేవంత్రెడ్డి వెంటనే స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు, ప్రజాస్వామికవాదులు స్పందించాలని కోరారు.