జగిత్యాల : రేవంత్ రెడ్డి పాలన కన్నా కేసీఆర్ ( KCR ) పాలన బాగుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి (Jeevan Reddy ) అన్నారు. 10 సంవత్సరాల కేసీఆర్ పాలనకు కాంగ్రెస్ పాలన తిరోగమనంలో నడుస్తుందని వెల్లడించారు. గురువారం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. నష్టపోయిన ప్రతి రైతును గత ప్రభుత్వం ఆదుకుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయిందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను, నిరుద్యోగులను ఏనాడు పట్టించుకోలేదు.ప్రజలు కేసీఆర్ 10 సంవత్సరాల పాలన తర్వాత బెటర్ పాలన కావాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్కు ప్రచార ఆర్భాటాలు తప్ప, ప్రజాహితంగా కార్యక్రమాలు నిర్మాణాత్మకంగా అమలు చేయలేకపోవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు. దీని ద్వారానే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వెల్లడించారు.
రాష్ట్రస్థాయిలో పోల్చుకుంటే ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన నాయకుడు కేసీఆర్తోనే
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కల సాకారమైందని అన్నారు.రేవంత్ పాలన చూసిన తర్వాత కేసీఆర్ పాలనే బాగుందని ప్రజలనుకుంటున్నారని తెలిపారు.బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.దీనికి కార్యరూపం ఏవిధంగా ఉండాలనేది కేటీఆర్ నిర్ణయిస్తారని,దానికి అనుగుణంగా ముందుకెళతానని పేర్కొన్నారు.