జనగామ : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న . అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆకర్షుతులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో స్వచ్ఛందంగా చేరుతున్నారని చెప్పారు. గురువారం జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండలం చిన్న వంగర గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ పాకనాటి సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై బీఆర్ఎస్లో చేరుతున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లోఎర్రబెల్లి గెలుపు కోసం పని చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకు ముందు పాలకుర్తి మండల కేంద్రంలోని గుడివాడ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు.